యథేచ్ఛగా ఇంటర్ అడ్మిషన్లు
ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట దందా
ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాడమీల పేరుతో ఇంటర్ చదువును వ్యాపారంగా మార్చుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అనుమతి లేకుండా ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీ అంటూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. భారీ హోర్డింగులతో ప్రచారం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంగా నిర్వహిస్తున్న బన్సాల్ క్లాసెస్, ఆకాశ్ ఇనిస్టిట్యూట్కు అనుమతి లేదని, ఐఐటీ, నీట్, ఎప్సెట్ అకాడమీలు ఇంటర్ బోర్డు పరిధిలోకి రావని, వాటిలో విద్యార్థులు ప్రవేశాలు పొంది మోసపోవద్దని, తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించి అనుమతి ఉన్న కళాశాలల్లో చేర్పించాలని డీఐఈవో ఆంజనేయరావు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.


