కరీంనగర్: సోలార్ వ్యవస్థను స్వయంగా అమలు చేసి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శనివారం కరీంనగర్లోని తన నివాసంపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకున్న ఆయన, అధికారులతో కలిసి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సూర్య ఘర్– ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని వివరించారు. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసి, ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం రూ.75 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ అందిస్తున్నదని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి రూ.30 వేల నుంచి రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, అదనంగా 80 శాతం వరకు రుణ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని వివరించారు. వ్యవసాయ రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం ముఫ్త్బిజిలీ యోజన పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్


