చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండుతున్నాయి. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలు పశువుల పాలు అవుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు, చేసిన కష్టం వృథా అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నవాబుపేట్, కొండాపూర్, ఉల్లంపల్లి, సుందరగిరి, బొమ్మనపల్లి, చిగురుమామిడి, లంబాడిపల్లి, గాగిరెడ్డిపల్లి గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఈ గ్రామాలకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు రావల్సి ఉండగా పనులు సాగడం లేదు. దీంతో బావులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో పొలాల్లో పశువులను మేపుతున్నారు.


