కొత్తపల్లి(కరీంనగర్): సేంద్రియ వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. కొత్తపల్లి రైతు వేదికలో శుక్రవారం ఆత్మ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు సమగ్ర శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయ పద్ధతులను వివరిచారు. నూతన వరి రకాల లక్షణాలు, అధిక దిగుబడులు సాధించే విధానాలు, పంటల ఎంపికపై వివరించారు. పంటల నిర్వహణ, సమతుల్య ఎరువుల విని యోగం, సేంద్రియ ఎరువుల ఉపయోగం, జీవ ఎరువులు (బయో ఫర్టిలైజర్స్);వ్యాధి నివారణ పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు మధుకర్, రజినీకాంత్ అవగాహన కల్పించా రు. ఏవో కె.సంతోష్ కుమార్, డీసీఎస్ వలంటీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
హెచ్పీవీ టీకా పక్కాగా అమలు చేయాలి
కరీంనగర్: జిల్లాలో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకా కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ చాంబర్లో టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్పీవీ టీకా ప్రాముఖ్యత, అమలు విధానం, లక్ష్య వయసు గల బాలికలకు టీకా అందించే చర్యలపై చర్చించారు. 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేసి, సర్వైకల్ కేన్సర్ నివారణలో ముందడుగు వేయాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. జాతరకు లక్షకు పైగా భక్తులు వస్తారని, రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. భక్తులకు తాగునీటి సరఫరా, శానిటేషన్, మెడికల్ క్యాంప్ ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షకు కలెక్టర్, సీపీ రాకపోవడం బాధాకరమన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ మాట్లాడుతూ.. గతేడాది కన్నా ఈసారి మెరుగ్గా బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆర్డీవో రమేశ్బాబు, ఆర్అండ్బీ డీఈ రాజశేఖర్రెడ్డి, ఇరిగేషన్ ఏఈ రాంకుమార్, డీఎం రవీందర్రెడ్డి, ఆర్టీవో వేణు, ఏసీపీ మాధవి, దేవాదాయ అదనపు కమిషనర్ సుప్రియ, డీపీవో జగదీశ్వర్, జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ ప్రశాంత్ కుమార్, సర్పంచ్ దార సురేశ్, అడిషనల్ సీపీ వెంకటరమణ, చైర్మన్ రామారావు, ఇన్చార్జి ఈవో సుధాకర్ పాల్గొన్నారు.
పీహెచ్సీల సందర్శన
కరీంనగర్: జిల్లాలోని చెల్పూరు, వావిలాల, ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్వో వెంకటరమణ శుక్రవారం సందర్శించారు. హాజరు, అవుట్ పేషెంట్ రిజిస్టరు, ఎన్సీడీ రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్, పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్, టెంపరేచర్ రికార్డుల నమోదును పరిశీలించారు. అవుట్ పేషెంట్లతో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీల్లో డెలివరీలు పెంచాలన్నారు. ఆరోగ్య మహిళ హెల్త్క్యాంపుల్లో స్క్రీనింగ్ చేసిన వారికి రీస్క్రీనింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నారు. వైద్యాధికారులు తులసిదాస్, వరుణ, మధుకర్ పాల్గొన్నారు.


