లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు!
ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకత
● ఇంద్రజాలంతో కట్టిపడేస్తున్న మెజీషియన్లు
● నేడు ప్రపంచ ఇంద్రజాలకుల దినోత్సవం
కోల్సిటీ(రామగుండం): వస్తువుల్ని సృష్టించడం, మాయం చేయడం, రూపం మార్చడం.. మెజీషియన్లు ఇలా రెప్పపాటులోనే అద్భుతాలు ఆవిష్కరిస్తారు. మంత్రాలు, తంత్రాలేమీకాదు.. అన్నీనిజాలే. ప్రేక్షకుల ఇంద్రియాలను మాయ చేసే కళ ఇది. దీన్నే ఇల్యూజన్, స్టేజ్ మేజిక్, క్లోజప్ మేజిక్ అని పిలుస్తారు. దైవాంశ శక్తులున్నవారే ఇలా చేయగలరని గుడ్డిగా నమ్మడం, చేతబడి వంటివి ఉన్నాయన్న మూఢనమ్మకాలతో మోసపోతున్న వారిలో చైతన్యం కల్పిస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంద్రజాలికులు. సోమవారం ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పద్మశ్రీ పీసీ సర్కార్(సీనియర్) జయంతి సందర్భంగా ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
గుర్తుకొచ్చేది పీసీ సర్కారే
మెజీషియన్లను చూడగానే తొలుత గుర్తుకొచ్చేది పీసీ సర్కారే(సీనియర్). ఆయన మనదేశంకోసం చేసిన సేవలను అభినందిస్తూ పద్మశ్రీ అవార్డును అందజేసింది. యునైటెడ్ స్టేట్స్ శ్రీఫోనిక్స్ అవార్డ్శ్రీ, జర్మన్ గోల్డ్బార్, గోల్డెన్ లారెల్ గర్లాండ్ అవార్డులతో డచ్దేశం సత్కరించింది. భారతప్రభుత్వం 2010 ఫిబ్రవరి 23న పీసీ సర్కార్ పేరున పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.
18వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన కళ
మేజిక్ అనేది గ్రీకు పదం. తొలుత ఇంద్రజాలికులుగా గ్రీకులు, పర్షియన్లుగా చెబుతారు. 18వ శతాబ్దంలో ఈ కళ బాగా ప్రసిద్ధి చెందింది. చాలాదేశాల్లో మ్యాజిక్ క్లబ్బులు, ట్రెయినింగ్ సంస్థలు ఉన్నాయి. ఏటా మెజీషియన్ చాంపియన్షిప్ పోటీలూ జరుగుతాయి. రెండోప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం ఓ మెజీషియన్ను తీసుకొచ్చి ఆఫ్రికా సైన్యాన్ని బోల్తా కొట్టించిందట.
ఉమ్మడి జిల్లాలో 30 మంది
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 30 మంది వరకు ఇంద్రజాలికులు ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి జిల్లా మెజీషియన్లకు ప్రత్యేకత ఉంది. గోదావరిఖనికి చెందిన మేజిక్ రాజా మెజీషియన్స్ అసోసియేషన్కు ఉపాధ్యక్షులు. అనేకసార్లు రాష్ట్రస్థాయి పోటీలకున్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. సింగరేణి ఉద్యోగి మేజిక్ అలాడీన్, ఆయన కూతురు అస్మా యాసీనా కూడా రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతులు సాధించారు. జిల్లా సీనియర్ మెజీషియన్లందరూ రాష్ట్రస్థాయి జాదూరత్న అవార్డులందుకున్నారు.
మేజిక్లో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేజిక్ను ఒకమలుపు తిప్పిన వాటిలో రెండు మేజిక్ ఫెస్టివల్స్ను ప్రధానంగా చెప్పుకోవాలి. అందులో ఒకటి వరంగల్లో మూడు రోజులపాటు జరిగిన మేజిక్ ఫెస్టివల్ ఒకటి కాగా, మరొకటి కరీంనగర్లో జరిగిన మేజిక్ ఫెస్టివల్ కొత్త ఒరవడి సృష్టించాయి, అప్పటివరకు సాదాసీదా సంప్రదాయబద్ధంగా చేస్తున్న మెజీషియన్లు తమ ప్రదర్శనాశైలిని మార్చుకున్నారు. ఇప్పుడు దేశవిదేశాలలో తెలుగు మెజీషన్లు ప్రదర్శనలు ఇవ్వడమే కాదు.. శిక్షకులుగా వ్యవహరించడం.. ఉమ్మడి జిల్లాకు దక్కిన గౌరవం. కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోసం మెజీషియన్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు!


