గృహ ప్రవేశాలకు సిద్ధం చేయండి
కరీంనగర్ అర్బన్/తిమ్మాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి దశలో పనులు మార్చి 31లోగా పూర్తిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు, కోతిరాంపూర్, తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలించారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడారు. పలు అంశాలపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక, ఇటుక, సిమెంటు, కొంత చౌకధరల్లో లభించేలా అధికారులు డీలర్లు నిర్వాహకులతో మాట్లాడాలని ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రోగ్రెస్ చాలా బాగుందని అభినందించారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ఆలం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్తో సమీక్షించారు. హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ నరసింహచారి, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.


