యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు
కరీంనగర్ అర్బన్/కొత్తపల్లి(కరీంనగర్): ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా రైతులకు పారదర్శకంగా ఎరువులు అందుతున్నాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కొత్తపల్లి మండలం చింతకుంట, మల్కాపూర్ డీసీఎంఎస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణం, గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, నిల్వల రిజిస్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా యూరియా కోసం వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు. యాప్లో యూరియా తీసుకునే పద్ధతి బాగుందని, వ్యయప్రయాసలు తగ్గాయని, ఎరువుల కొనుగోలు కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం తప్పిందని రైతులు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ, భూమి విస్తీర్ణాన్ని బట్టి యూరియా కోటాను యాప్ నిర్ణయిస్తోందని చెప్పారు. దీంతో ఎరువుల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా పారదర్శకత పెరిగిందన్నారు. డీఏవో భాగ్యలక్ష్మి, మార్క్ఫెడ్ డీఎం గౌరీనాగేశ్వరరావు, సహాయ సంచాలకులు రణధీర్, ఏఈవో రాజేంద్రప్రసాద్, ఎంఏవో సంతోష్ పాల్గొన్నారు.
సర్వేయర్లకు లైసెన్స్లు అందజేత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం–2025లో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే సీఎం లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్లు జారీ చేయగా జిల్లాకు చెందిన 136మందికి అందజేశారు. మంగళవారం 41 మంది అభ్యర్థులకు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి లైసెన్స్లు అందజేశారు.


