హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Feb 18 2026 6:58 AM | Updated on Feb 18 2026 6:58 AM

హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జగిత్యాల బైపాస్‌రోడ్‌లోని సాయిరాంనగర్‌ వద్ద ఈనెల 15న బోరె విశ్వనాథ్‌ (30) హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ తెలిపారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వారిని అరెస్ట్‌ చూపారు. జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన బోరె విశ్వనాథ్‌, ఇదే మండలం ఒడ్డెరకాలనీకి చెందిన ఆలకుంట లక్ష్మీ సాయిరాంనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. లక్ష్మీకి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ విశ్వనాథ్‌తో ఉంటుండడంతో ఆమె భర్త ఆలకుంట గంగాధర్‌, అతడి బావమరిది బోదాసు తిరుపతి లక్ష్మీపై కక్ష పెంచుకున్నారు. ఆదివారం విశ్వనాథ్‌, లక్ష్మీ సాయిరాంనగర్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా గంగాధర్‌, తిరుపతి వారిని వెంబడించారు. విశ్వనాథ్‌పై కట్టెలతో దాడి చేయగా అక్కడికక్కడే చనిపోయాడు. లక్ష్మీపైనా దాడిచేయడంతో తప్పించుకుని పారిపోయింది. మృతుడి తండ్రి బోరె చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు లింగంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్నారన్న సమాచారంతో వెళ్లి పట్టుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. పట్టణ సీఐ కరుణాకర్‌, ఎస్సై సుప్రియ, కానిస్టేబుల్‌ జీవన్‌ పాల్గొన్నారు.

జగిత్యాల డీఎస్పీ రఘుచందర్‌ వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement