గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు
జగిత్యాల: రానున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ముఖ్యంగా ధర్మపురి, కోటిలింగాల ఆలయాలకు ప్రాధాన్యం ఇచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లు, భక్తుల రద్దీని అంచనా వేసుకుని వసతులు కల్పించాలని సూచించారు. 2027 జూలైలో పుష్కరాలు ఉంటాయని, ఆమేరకు పుష్కరఘాట్లను ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఒకేరోజు రెండు లక్షలకుపైగా భక్తులు వచ్చినా పుష్కరఘాట్ల వద్ద ఇబ్బంది రానీయొద్దన్నారు. పార్కింగ్, తాగునీరు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్


