రోడ్డెక్కిన రైతులు
శంకరపట్నం: రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. పారదర్శకంగా యూరియా అందించాలని ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ అన్నదాతలకు చుక్కలు చూపుతోంది. యాప్లో బుక్చేసినా యూరియా అందడం లేదని శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో గురువారం రైతులు రోడ్డెక్కారు. అరగంటపాటు కరీంనగర్– వరంగల్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. తాడికల్ సహకార సంఘానికి యూరియా లోడ్తో లారీ వచ్చింది. రైతులు గోదాం వద్దకు చేరుకుని మొబైల్ యాప్లో బుకింగ్ చేసుకున్నారు. అయితే రెండు నిమిషాల్లోనే స్టాక్ క్లోజ్ అని చూపడంతో రైతులు ఆగ్రహించారు. గోదాం నుంచి రోడ్డుపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి కలుపుతీత పనులు జరుగుతున్నాయని, పొలాల వద్దకు వెళ్లకుండా నిత్యం గంటల తరబడి ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతున్నామని ఆరోపించారు. పొలానికి యూరియా వేయకుంటే ఎర్ర బడుతోందని వాపోయారు. ఆంక్షలు లేకుండా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.


