అటు పరీక్షలు.. ఇటు ఎన్నికలు
ఈ నెల 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
కొనసాగుతున్న ‘పది’ ప్రత్యేక తరగతులు
ఎన్నికల శిక్షణలు, ఇలా ఎన్నెన్నో
మున్సిపోల్ తరువాత పరిషత్ ఎన్నికలు
పరీక్షల నిర్వహణపై ప్రభావం
కరీంనగర్టౌన్: బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి సెలవులు. గత నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు. తాజాగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు తల పట్టుకునే పరిస్థితి నెలకొంది. ఈ విద్యా సంవత్సరంలో చదువు సంగతి దేవుడెరుగు.. ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఇప్పు డు మున్సిపల్ ఎన్నికలు, వెనువెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం ఇంటర్, ఎస్సెస్సీ, ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్ పరీక్షలపై పడే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 11న బల్దియా పోలింగ్ ఉన్నందున అటు ఎస్సెస్సీ, ఇటు ఇంటర్ పరీక్షల నిర్వహణ కత్తి మీద సాములా మారింది. జనవరి 21నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షికపరీక్షలు ఉన్నాయి. పరీక్షల సమయంలోనే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఉంటుంది. ఇటు పరీక్షలు.. అటు ఎన్నికలు విద్యాశాఖ అధికారుల్లో కలవరం రేపుతోంది.
ఎన్నికల విధుల నుంచి తప్పించండి
ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బంది, లెక్చరర్లకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పరీక్షల సమయంలో సమన్వయం, పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణ వంటి విధుల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నిమగ్నమై ఉంటారని, వీరిని ఎన్నికల విధుల నుంచి మినహాయిస్తేనే పాఠశాల విద్యా సజావుగా సాగుతుందని సూచిస్తున్నారు.


