కరీంనగర్ కార్పొరేషన్: ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ పథకాలు, నగరపాలకసంస్థ సేవలు ప్రతీగడపకు చేరాలనే లక్ష్యంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టామన్నారు. గురువారం నగరంలో డివిజన్ల వారీగా వార్డు సభలు జరిగాయి. 2వ డివిజన్లో తీగలగుట్టపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన వార్డు సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 43వ డివిజన్ గోదాంగడ్డ దోభీఘాట్ ఫంక్షన్హాల్లో జరిగిన వార్డు సభకు ముఖ్యఅథితిగా హాజరయ్యారు. వార్డు సభల ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పారిశుధ్యాన్ని మెరుగు పరచడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ..ప్రగతి ప్రణాళికలో యువత, మహిళల పాత్ర కీలకమన్నారు. వార్డు సభలు విజయవంతమయ్యాయని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అన్నారు.
జనాలు అంతంతే...
నగరంలో నిర్వహించిన వార్డు సభలకు ప్రజల నుంచి స్పందన అంతగా లభించలేదు. కేవలం ఒక్క రోజు ముందుగానే వార్డు సభలను నిర్వహించాలని నిర్ణయించి, హడావుడిగా సభలు ఏర్పాటు చేయడమే కారణంగా కనిపిస్తోంది. వార్డు సభల ప్రచారానికి తగినంత సమయం లేకపోవడంతో పాటు సమన్వయం కొరవడడంతో ఒకటి, రెండు డివిజన్లు మినహా సభలకు ప్రజల ఆదరణ అంతగా లభించలేదు. అలాగే ఉదయం 10 గంటలకు సభలు ప్రారంభించాలని చెప్పినప్పటికి, కొన్ని డివిజన్లలో 11 గంటల వరకు కూడా టెంట్లు, కుర్చీలు వేస్తూ కనిపించారు. వార్డు సభలో ముందుగా సందేశం వినిపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా డివిజన్లకు చెందిన పథకాల లబ్దిదారుల పేర్లను చదివారు. షరామామూలుగానే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర దరఖాస్తులు ఉన్నాయి.
వేదికపై నాయకులు
వార్డు సభల సందర్భంగా చాలా డివిజన్లలో కార్పొరేటర్లు, అధికారులతో పాటు స్థానిక నాయకులు వేదికపై కూర్చోవడం విమర్శలకు దారితీసింది. కొన్నిచోట్ల మహిళా కార్పొరేటర్లతో పాటు వాళ్ల భర్తలు వేదికపై ఆసీనులయ్యారు. దరఖాస్తుల స్వీకరణ, కార్యక్రమ నిర్వహణలో అంతా వాళ్లే అయ్యారు. చాలా చోట్ల స్థానిక డివిజన్ నాయకులు కూడా ఏ అధికారిక హోదా లేనప్పటికి అధికారిక కార్యక్రమ వేదికపై కూర్చున్నారు.


