ప్రలోభాల పర్వం
మాంసం, మద్యం.. స్వీట్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులందరిదీ అదే దారి ఓటర్లను ఆకట్టుకునేందుకు రోజువారీ పంపకాలు మొదటి విడతకు రెండు రోజులే ప్రచారం రేపు మూడో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
ప్రచారం కన్నా ప్రసన్నం చేసుకునేందుకే ఆసక్తి
కరీంనగర్/కరీంనగర్టౌన్: పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా అభ్యర్థులు ట్రెండ్ మార్చారు. ప్రచారం కన్నా ప్రలోభాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకు ఇంటింటా, సోషల్ మీడియా ప్రచారంలో తలమునకలైన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు ఇక ప్రలోభాల దారి పడుతున్నారు. మాంసం, మద్యం పంపిణీ చేస్తున్నారు. వద్దంటే స్వీట్లు, కూల్డ్రింక్స్ పంపిస్తున్నారు. మొదటి, రెండోవిడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ప్రచారం ఊపందుకోగా.. మూడో విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో రేపు గుర్తులు కేటాయించనున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాంసం వ్యాపారులతో ఒప్పందానికి వచ్చిన అభ్యర్థులు వైన్స్ల్లో అడ్వాన్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది. కిరాణా దుకాణాలు, బేకరీల్లో కూల్డ్రింక్స్ విక్రయాలు జోరందుకున్నాయి. వార్డుస్థానాలకు పోటీ చేస్తున్న వారు సైతం ఖర్చుకు వెనుకా డటం లేదు. ఉప సర్పంచ్ పదవిని దృష్టిలో ఉంచుకొని రూ.లక్షల్లో ఖర్చుచేసేందుకు రెడీగా ఉన్నారు.
గుర్తుల గుబులు
గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేస్తున్నవారికి కేటాయిస్తున్న గుర్తులు ఒకే పోలికతో ఉండడంతో వారిలో ఆందోళన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు ఆ గుర్తులను గుర్తుంచుకోవడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉండవు. కేవలం గుర్తు మాత్రమే ముద్రిస్తారు. అసలే పరిమిత ఓట్లు కావడంతో ప్రతి ఓటు కీలకం కానుంది. ఈ క్రమంలో ఓట్లు తారుమారైతే.. అభ్యర్థుల భవితవ్యం ప్రమాదంలో పడుతుందనే భయం అందరినీ వెంటాడుతోంది. ఒకే పోలికతో ఉండే పలు గుర్తులు ఓటర్లను తికమక చేసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి స్థానంలో ఉంగరం, రెండోస్థానంలో కత్తెర ఉన్నాయి. అవీ చూడగానే సులువుగా అర్థమవుతోంది. మూడో స్థానం బ్యాట్, ఆరో స్థానంలో టీవీ రిమోట్, ఏడో స్థానంలో టూత్ పేస్ట్, ఎనిమిదో స్థానంలో సాసర్ ఉన్నాయి. పలక, బ్లాక్ బోర్డు, బిస్కెట్, మంచం వంటి గుర్తులు ఒకేలా ఉండడంతో ఓటర్లు ఇబ్బందులు పడే అవకాశముంది. దువ్వెన, ఆరటిపండు గుర్తులు కూడా ఒకేలా ఉన్నాయి. గ్యాస్ స్టా, సిలిండరు వేరువేరుగా ఇవ్వడం ఇబ్బందిగానే ఉంటుంది.
రెబల్స్ బెడద
చాలా గ్రామపంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు రెబల్స్ బెడద పట్టుకుంది. ఒకే పార్టీకి, ఒకే కులానికి, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చొప్పున పోటీలో ఉండే సరికి ఓట్లు చీలుతాయనే భయం పట్టుకుంది. వారిని బుజ్జగించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి చెందిన అభ్యర్థి అయితే పెద్దనాయకులతో, ఒకే కులానికి చెందిన వారు అయితే ఆ కులపెద్దలతో, కుటుంబ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.
నిబంధనలు కీలకం
పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ 48గంటల ముందు ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అనుమతులు లే కుండా సమయాన్ని మించి ఊరేగింపులు తీయొ ద్దు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లు వాడొద్దు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఎన్నికల ప్రచార పోస్టర్లు అంటించొద్దు. గోడలపై ప్రచార రాతలతో ఇతరులకు ఇ బ్బంది కలిగించొద్దు. ఇలా చేస్తే 1997 చట్టం ప్రకా రం మూడు నెలల కారాగార శిక్ష లేదా రూ.1000 జరిమానా విధించే అవకాశముంది.
మొదటి విడతకు
ఇక రెండు రోజులే ప్రచారం
జిల్లాలోని 316 గ్రామ పంచాయతీలు, 2946 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ప్రచారం జోరందుకుంది. ప్రచార గడువు రెండు రోజులే ఉండగా.. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. 9వ తేదీ సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. మొదటి విడత ఐదు మండలాల్లోని 92 గ్రామ పంచాయతీగాను చొప్పదండి మండలం దేశాయిపేట, పెద్దకురమపల్లె, రామడుగు మండలం శ్రీరాములపల్లె ఏకగ్రీవం అయ్యాయి. 866వార్డులకు 276వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగితా గ్రామాల్లో ఆదివారం నుంచి ప్రచారం వేడెక్కింది. తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. కొన్ని గ్రామాల్లో తమకు కేటాయించిన బ్యాట్, ఉంగరం, కత్తెర వంటి గుర్తులు ఉన్నవారు ఓటర్లకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ సంఖ్యలో ఓట్లు ఉన్న పెద్ద కుటుంబాలకు వెండినాణేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రలోభాల పర్వం


