ఓటేసి పోండి
బాబాయ్ నమస్తే.. అంతా కుశలమేనా.. సర్పంచ్గా పోటీచేస్తున్న.. 11న మన పోలింగ్ ఉంది. పిన్ని, చిన్నోడు, నువ్వు బుధవారం సాయంత్రంలోగా ఊరికి వచ్చేలా ప్లాన్ చేసుకో. ఏం ఫికర్ పడకు. రానుపోను చార్జీలతోపాటు పైఖర్చులు కూడా చూసుకుంట. ఈ నంబరుకు ఫోన్ పే ఉందికదా? రవాణా చార్జీలు పంపుతా.. లేదా.. మన ఊరోళ్లు మీ కాలనీలో ఎవరైనా ఉంటే ఓ కారు మాట్లాడుకోని అందరూ రండి.. కిరాయి నేనేఇస్త. నామీద ఒట్టే.. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఓటెయ్యాలి?
– వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస ఓటర్లను ప్రసన్నం
చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లకు ఇది నిదర్శనం.
సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్/
కరీంనగర్ టౌన్/హుజూరాబాద్:
గ్రామం యూనిట్గా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. స్వల్ప తేడా ఓట్లతోనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానిక ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ ఓటరుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ‘నువ్వా.. నేనా’ అన్నట్లు ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వార్డుల వారీగా అనుకూల ఓట్లపై ఆరా తీస్తూ వారిని ఎలా కలవాలి? అనే దానిపై ప్లాన్ చేస్తున్నారు.
ఉపాధి కోసం వెళ్లినవారిపై ఫోకస్..
ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామ ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. ఎంతమంది, ఎక్కడెక్కడ ఉన్నారని ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు, బూత్ కన్వీనర్లు, ఏజెంట్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 200 మందివరకు వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా వేసుకుంటూ ప్రత్యేకంగా బృందాలనూ రంగంలోకి దింపారు. వలస వెళ్లిన వారికి ఫోన్లపై ఫోన్లు చేయిస్తున్నారు. ఎక్కడ ఉన్నా పోలింగ్కు ఒకరోజు ముందుగానే స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారి ఫోన్ నంర్లు సేకరిస్తూ, వాట్సప్ గ్రూప్లు క్రియేట్ చేస్తూ వారితో టచ్లో ఉంటున్నారు.
ముందస్తు చెల్లింపులు కూడా..
ముందుగానే డబ్బులు పంపిస్తే ఓటర్లు తమకు ఓట్లు వేస్తారని, లేకపోతే వేయకపోవచ్చని భావించి కొందరు అభ్యర్థులు ముందుగానే డబ్బులు ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో ఓటరుకు రాకపోకలకయ్యే ఖర్చుతోపాటు అదనంగా ఓటకు రూ.500 వరకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లిన వారు గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చినవారు తమకు వచ్చే కూలి డబ్బులు నష్టపోకుండా చెల్లింపులు చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు.
ప్రత్యేక వాహనాల ఏర్పాటు..
ఓటరు జాబితా ఆధారంగా వార్డుల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఒకేచోట ఎక్కువమంది ఉంటే ప్రైవేట్ వాహనం అద్దెకు తీసుకుని రావాలని, లేనిపక్షంలో ఇక్కడి నుంచి పంపిస్తామని హామీ ఇస్తున్నారు. ఎంతమంది ఓటర్లు గ్రామాలకు వస్తున్నారనేది తెలుసుకుని అందుకు సరిపడా డబ్బులు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్పే, గూగుల పే వివరాలు సేకరిస్తున్నారు. రవాణా ఖర్చులకు తోడు పైఖర్చులను సైతం చెల్లింస్తామంటూ ఆఫర్స్ ఇస్తున్నారు.
‘గుర్తు’ కోసం: పల్లె ప్రచారం జోరుగా సాగుతోంది. కొంత మంది సర్పంచ్ అభ్యర్థులు గుర్తును గుర్తుంచుకోవాలని ఓటర్లకు వారికి కేటాయించిన ఉంగరం, కత్తెర, కప్పు సాసర్లు, బ్యాట్లు, కాక్లు, జగ్గులు ఓటర్లకు పంపిణీ చేసి పడరాని పాట్లు పడుతున్నారు. కులసంఘాల సభ్యులకు నగదు ముట్టజెబుతున్నారు. యువకులకు క్రికెట్ కిట్లు, మహిళ సంఘాలకు నగదు, ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారు.
ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్లు
ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. వాట్సాప్ ద్వారా కూడా అభ్యర్థులు తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. తాము గెలిస్తే ఏంచేస్తామో వివరిస్తూ వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. విందులు, వినోదాలకు ఆన్లైన్ పేమెంట్లు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎలాగు పంచాయతీ పీఠాన్ని దక్కించుకునే ప్లాన్ చేస్తున్నారు.
ఓటేసి పోండి


