
దోస్త్..లాస్ట్ చాన్స్
సద్వినియోగం చేసుకోవాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్): డిగ్రీలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ పొందేందుకు ప్రభుత్వం విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించింది. చివరి విడతగా గురువారం ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటివరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. స్పాట్లో అన్ని కళాశాలలకు అవకాశం కల్పించారు. దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను ఆయా కళాశాలలు నేడు నోటీస్ బోర్డులో ఉంచనున్నారు. ఏయే కోర్సుల్లో ఖాళీలున్నాయో పొందుపర్చనున్నారు. దోస్ట్ పోర్టల్లో కూడా ఖాళీలు పొందపర్చనున్నట్లు సమాచారం.
15, 16న అడ్మిషన్స్
దోస్త్ చివరి అవకాశంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్ట్ పోర్టల్లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వచ్చిన రిజిస్ట్రేషన్ ఫాంను కళాశాలలో చూపించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ లోకల్ విద్యార్థులకు ఈనెల 15, 16తేదీల్లో జరుగనుంది. అదే విధంగా స్పాట్ అడ్మిషన్లో భర్తీ కానీ సీట్లకు ఈనెల 18, 19 తేదీల్లో వన్ టైం స్పెషల్ స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందొచ్చు. ఇదే తేదీల్లో నాన్ లోకల్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అవకాశం ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అందించాల్సిన సర్టిఫికెట్లు..
ఒరిజినల్ ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, టీసీ, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, నివాసం, బ్రిడ్జి కోర్సు సర్టిఫికెట్ (వర్తించు విద్యార్థులకు) సర్టిఫికెట్లతో దోస్త్ పోర్టల్లో చేసుకున్న రిజిస్ట్రేషన్తో పాటు జిరాక్స్ కాపీలను కళాశాలలో అందించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో దోస్త్ అధికారులు కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సుల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.
నో రీయిబర్స్మెంట్..
స్పాట్ అడ్మిషన్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఫీజు రీయిబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఏటా కళాశాల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
డిగ్రీ ప్రవేశాల కోసం చివరి విడతగా షెడ్యూల్ విడుదల
15, 16న అడ్మిషన్లు
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు చివరి అవకాశం. అడ్మిషన్ తీసుకోని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.
– డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ,
ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్

దోస్త్..లాస్ట్ చాన్స్