
● ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో కమీషన్ దందా ● ఆస్ప
లయన్స్ క్లబ్ స్కానింగ్ సెంటర్లో సీటీస్కాన్ చేస్తున్న టెక్నీషియన్
కరీంనగర్ టౌన్:
నగరంలో ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. వైద్యం మాట దేవుడెరుగు. వ్యాధి నిర్ధారణ పేరుతో ప్రైవే టు ఆసుపత్రులతో కలిసి రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఏదైనా రోగం వస్తే ఆసుపత్రికి వెళ్లాలంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు భయపడాల్సి వస్తుందని నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు కుమ్మక్కై పర్సెంటేజీల దందా నడిపిస్తున్నారు. రెఫర్ చేసిన వైద్యుడికి 50శాతం వరకు కమీషన్ ఇస్తూ రోగులను నిండా ముంచుతున్నారు.
అద్దాల మేడలు.. అడ్డగోలు ధరలు
నగరంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. అద్దాల మేడల్లో సెంటర్లను ఏర్పాటుచేసి, మంచి కమీషన్ ఇస్తామని పలు ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో కుమ్మక్కవుతున్నారు. పీఆర్వోల ద్వారా ప్రచారం చేసుకుంటూ రోగులను తమ సెంటర్లకే పంపించమని కోరుతున్నారు. పలు సెంటర్లు నేరుగా ఆస్పత్రులకు అంబులెన్స్లను పంపించి, రోగులకు పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆస్పత్రికి చేరుస్తున్నారు. ఈ భారం కూడా రోగులపైనే వేస్తున్నారు. పలు ఆస్పత్రుల నిర్వాహకులు ఎవరెక్కువ పర్సంటేజీ ఇస్తే ఆ ల్యా బ్కే రోగులను రిఫర్ చేస్తున్నారు. తెలిసిన ల్యాబ్లో పరీక్షలు చేయించుకుంటామంటే రిపోర్టు చెల్లదంటూ పలువురు వైద్యులు భయపెడుతున్నారు.
ప్రజలకు అందుబాటులో లయన్స్క్లబ్, రెడ్క్రాస్ సేవలు
లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ 320జి సంస్థ రెడ్క్రాస్ సొసైటీ సహకారంతో 2021లో స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్ను నగరంలోని ఉస్మాన్పురలోని రెడ్క్రాస్ సొసైటీ భవనంలో ఏర్పాటుచేశారు. నిరుపేదలకు ల్యాబ్ టెస్టులు, స్కానింగ్లు తక్కువ ధరకే అందించాలని రూ.3కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలు, సీటీస్కాన్ మిషన్ ఏర్పాటు చేశారు. సీటీస్కాన్ ద్వారా 15రకాల టెస్టులు, ల్యాబ్ ద్వారా 168 రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజు 200మంది రక్తపరీక్షలు, స్కానింగ్ కోసం రావడం గమనార్హం. షుగర్, కిడ్నీ, థైరాయిడ్, సీబీపీ, జ్వరం సంబంధిత టెస్టులకు ఎక్కువగా వస్తున్నారు. ప్రజలు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో డబ్బులను గుల్ల చేసుకోవద్దని, తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇరు సంస్థల నిర్వాహకులు కోరుతున్నారు.