● ముగ్గురి దుర్మరణం
● జాతీయ రహదారిపై లచ్చన్ గేట్ సమీపంలో దుర్ఘటన
మద్నూర్(జుక్కల్):జాతీయ రహదారి 161పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మండలంలోని లచ్చన్గేట్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద ఎక్లారకు చెందిన కాల్నోరే నాగు(48), కాల్నోరే సచిన్(18), జుక్కల్ మండలం నాగల్గావ్ గ్రామానికి చెందిన ముత్యాలవార్ అశోక్(21) బైక్పై మద్నూర్ నుంచి పెద్ద ఎక్లార వైపునకు వెళ్తుండగా లచ్చన్ గేట్ సమీపంలోని జాతీయ రహదారి 161పై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో సచిన్ అనే యువకుడు అక్కడిక్కకడే మృతి చెందాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నాగు,అశోక్లను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మూడు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది.
లిఫ్ట్ అడిగి ప్రాణాలు కోల్పోయి..
పెద్ద ఎక్లారకు చెందిన కాల్నోరే నాగు, అతడి తమ్ముడి కొడుకు కాల్నోరే సచిన్ మద్నూర్ మండల కేంద్రంలో మేసీ్త్ర వద్ద కూలీ పనులు చేస్తుంటారు. వీరు నిత్యం ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తారు.
నాగల్గావ్కు చెందిన ముత్యాలవార్ అశోక్ హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. నెల రోజుల క్రితం చెల్లెలి వివాహం ఉండటంతో సొంతూరకు వచ్చాడు. మంగళవారం పని నిమిత్తం మద్నూర్కు వెళ్లిన అశోక్.. రాత్రి బైక్పై తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో కూలీ పనులు ముగించుకొని పెద్ద ఎక్లారకు వెళ్లేందుకు ఆటో కోసం వేచి ఉన్న నాగు, సచిన్లు అశోక్ను లిఫ్ట్ అడిగారు. వారికి అశోక్ లిఫ్ట్ ఇచ్చాడు. ముగ్గురు కలిసి బైక్పై అతివేగంగా వెళ్తూ.. రోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించక ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు.


