కామారెడ్డి క్రైం: ఆస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకునేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సురక్షిత మాతృత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమాలు ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ప్రసూతి సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రవీందర్ గౌడ్, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శాబ్దిపూర్ పల్లె దవాఖానా సందర్శన
కామారెడ్డి రూరల్: శాబ్దిపూర్లోని పల్లె దవాఖానాను బుధవారం కలెక్టర్ సందర్శించారు. వైద్యాధికారితో మాట్లాడి గర్భిణులు, బాలింతలకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. పోషణ, సీజనల్ వ్యాధులు, క్షయ, లెప్రసీ వంటి వ్యాధులపై గ్రామ సర్పంచ్, హెల్త్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, డీఎంహెచ్వో రవీందర్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్ రాజు, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


