● జిల్లాలో చెప్పులు లేకుండా స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు 75 వేలకు పైనే
● ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ
పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం
ఎల్లారెడ్డి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవే ట్ స్కూళ్లకు ధీటుగా మెరుగు పరుస్తున్నామని ప్ర భుత్వం చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో దాదాపు అందరూ నిరుపేదల పిల్లలే. తమ పిల్లలను బడికి పంపించడం కూ డా వారికి భారమే. తాము తిన్నా తినకపోయినా స ర్కారు బడులలో పిల్లలకు ఇస్తున్న యూనిఫామ్లు, పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం ద్వారా తమ పిల్లలకు తిండి, బట్టా దొరుకుతుందని ఆశతో పిల్లలకు బడులకు పంపుతున్నారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థులకు భోజనం, దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, ఇతర సామగ్రి సమకూరుస్తున్నామని చేస్తున్న ప్రకటలకు వాస్తవ పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉంది. పాఠశాల విద్యార్థులకు రెండేసి జతల యూనిఫామ్లు ఇస్తున్నామని అంటున్నా పాఠశాల ప్రారంభంలో ఒకే జత పంపిణీ చేశారు. మళ్లీ జనవరి, ఫిబ్రవరిల్లో రెండో జత పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా జిల్లాలో దాదాపు 75 వేల మంది విద్యార్థులు ఎలాంటి చెప్పులు లేకుండా స్కూళ్లకు వస్తున్నారని తెలిసింది. జిల్లాలో 1,045 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 730 ప్రాథమిక, 131 ప్రాథిమికోన్నత, 184 ఉన్నత పాఠశాలలున్నాయి. 99,896 మంది విద్యార్థులుండగా అందులో 46,595 మంది ప్రాథమిక.. 27,696 మంది ప్రాథమికోన్నత.. 35,640 మంది ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులో 90 శాతం మంది చెప్పులు లేకుండానే పాఠశాలలకు వస్తున్నారు.
ఎల్లారెడ్డి మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేయ గా పలు పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎలాంటి చెప్పులు లేకుండానే వస్తున్నారని తెలిసింది. మండలంలోని మల్లాయిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు ఉండగా వీరెవ్వరికి చెప్పులు లేవు. అలాగే ఎంపీపీఎస్ లింగారెడ్డిపేటలో 67 మంది, ఎంపీపీఎస్ వెల్లుట్లలో 70 మంది, ఎంపీపీఎస్ అడవిలింగాలలో 64 మంది, ఎల్లారెడ్డిలోని ఎంపీపీఎస్(గర్స్)లో 135 విద్యార్థినులు ఉండగా వీరిలో 90 శాతం మందికి పైగా చెప్పులు లేకుండానే వస్తున్నారు. ఎర్రటి ఎండలో చిన్నారులు ఎలాంటి పాదరక్షలు లేకుండా పాఠశాలలకు రావడం అందరినీ కలచివేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఏ మాత్రం అమలు కావడం లేదు.
మానవతావాదులు స్పందించాలి..
ప్రభుత్వం పట్టించుకోకపోయినా కనీసం సామాజిక స్పృహ కలిగిన మానవతావాదులు, సామాజిక సేవా సంస్థలు, పేద విద్యార్థుల ఈ చెప్పు కొనలేని బాధను అర్థం చేసుకోవాల్సి ఉంది. అలాగే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు నీళ్లు తెచ్చుకోవడానికీ నానా తంటాలు పడుతున్నారు. పిల్లలు తమకు దొరికిన ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. అపరిశుభ్రంగా తక్కువ మైక్రాన్ మందం ఉన్న బాటిళ్లను వాడటం వల్ల వీరు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మంచి బాటిళ్లను సరఫరా చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ఈ విషయంపై దృష్టి పెట్టి కనీస సాయం చేస్తే పేద పిల్లల చదువులను ప్రోత్సహించినట్లవుతుంది.


