లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె శివారులో తవ్వించిన ఊట బావిని మంగళవారం ఆర్డబ్ల్యూఎస్ డీఈ ప్రవీణ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో బోరుబావులు అడుగంటిపోతున్న క్రమంలో ఊట బావులు గ్రామాలకు రక్షణగా నిలుస్తున్నాయన్నారు. రూ.90 వేల వ్యయంతో ఊట బావిని తవ్వించినట్లు తెలిపారు. మోతె గ్రామానికి ఊట బావి ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామంలోని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. ఏఈ రంజిత్, కారోబార్ సాయిలు, వాటర్మెన్ రవి తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బెజుగంచెర్వుతండా, ఎర్రకుంటతండాను మంగళవారం డీపీవో మురళీ సందర్శించారు. బెజుగంచెర్వుతాండ గ్రామపంచాయతీ భవన నిర్మాణ విషయమై బెజుగంచెర్వుతండాతోపాటు ఎర్రకుంటతండాల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీవో రెండు తండాలను సందర్శించారు. రెండు తండాలలోనూ జీపీ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలాలను ఆయన పరిశీలించారు. దీంతోపాటు ఇరుతండావాసులతోనూ వేర్వేరుగా ఆయన మాట్లాడారు. పూర్తి నివేదికను రూపొందించి కలెక్టర్కు అందజేస్తామని ఆయన చెప్పారు. నాగిరెడ్డిపేట ఎంపీవో ప్రభాకరచారి, గ్రామసర్పంచ్ భాస్కర్, ఉపసర్పంచ్ పీక్లా, పంచాయతీ కార్యదర్శి అనిత, వార్డుసభ్యులున్నారు.
గాంధారి(ఎల్లారెడ్డి): బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటరు జాబితాల్లో తప్పులను సరిదిద్దాలని, ఇంటి యజమానులతో వివరాలు సేకరించి నమోదు చేయాలని, 18 ఏళ్లు నిండిన యువతీయువకుల పేర్లను జాబితాలో నమోదు చేయాలని డీఆర్డీవో సురేందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఐకేపీ భవనంలో కొనసాగుతున్న బీఎల్వోల శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ రేణుక చౌహాన్, సిబ్బంది పాల్గొన్నారు.


