మరో నాలుగు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతటా అదే చర్చ సాగుతోంది. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలను 50 శాతం మేరకు పెంచనున్నట్లు సంకేతాలు వస్తుండడంతో రాష్ట్రంలో శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో జనాభా 15,71,022, కామారెడ్డి జిల్లాలో 9,72,625 ఉంది. ఇక గత ఎన్నికల(2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో మహిళా కోటా శాసనసభ స్థానాలు సైతం ఉమ్మడి జిల్లా నుంచి గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పలువురు నాయకులతోపాటు మహిళా నాయకురాలు సైతం చట్టసభలో ప్రాతినిధ్యంకోసం లెక్కలు వేసుకుంటున్నారు. జనగణన, కులగణన తరువాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం చేస్తుండడంతో అన్నివర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం చూసినప్పటికీ, తాజాగా నిర్వహించే జనాభా లెక్కలు, కులగణన మేరకు చూస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 5 శాసనసభ సీట్లు 8కి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ఒక శాసనసభ సీటు పెరిగే అవకాశం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రం, చుట్టుపక్కల ప్రాంతాలను బట్టి నిజామాబాద్ అర్బన్ పరిధిలో నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ సౌత్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ నియోజకవర్గాలన్నీ ఒకే జిల్లా పరిధిలో ఉండనున్న నేపథ్యంలో ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, కోటగిరి, పొతంగల్ మండలాలను సైతం నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయనున్నారు. దీంతో ఈ మండలాలు బోధన్ నియోజకవర్గం పరిధిలోకి కలుపనున్నారు. ఈ నేపథ్యంలో బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎడపల్లి, నవీపేట, రెంజల్ మండలాలను మరో నియోజకవర్గంలో కలిపే అవకాశాలున్నాయి. అలాగే కొత్తగా భీమ్గల్, నందిపేట, నిజామాబాద్ రూరల్ స్థానంలో డిచ్పల్లి ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో దోమకొండ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
● నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ నార్త్, ఎడపల్లి మండలాలు, విలీన గ్రామాలు
● నిజామాబాద్ సౌత్: నిజామాబాద్ సౌత్, నిజామాబాద్ రూరల్, మోపాల్, మోస్రా
● డిచ్పల్లి: డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి
● భీమ్గల్: భీమ్గల్, సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్
● బాల్కొండ: బాల్కొండ, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్పల్లి
● ఆర్మూర్: ఆర్మూర్, ఆలూర్, డొంకేశ్వర్
● నందిపేట: నందిపేట, నవీపేట, రెంజల్, మాక్లూర్
● బోధన్: బోధన్, సాలూర, వర్ని, చందూర్, రుద్రూర్, పొతంగల్, కోటగిరి
● బాన్సువాడ: బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, మహ్మద్నగర్, నిజాంసాగర్
● జుక్కల్: జుక్కల్, బిచ్కుంద, మద్నూర్,
పెద్దకొడప్గల్, పిట్లం, డోంగ్లి
● ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, గాంధారి
● కామారెడ్డి: కామారెడ్డి, సదాశివనగర్,
రాజంపేట
● దోమకొండ: దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి
మహిళా కోటాలో 33 శాతం సీట్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 182కి పెరిగితే 60 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జి ల్లా నుంచి శాసనసభలో మహిళల ప్రాతినిథ్యం గణనీయంగానే ఉండే అవకాశాలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 9 నుంచి 13కు పెరగనున్న శాసనసభ స్థానాలు
నిజామాబాద్ జిల్లాలో 5 నుంచి 8కి..
కామారెడ్డి జిల్లాలో 4 నుంచి 5కు..
ఉమ్మడి జిల్లాలో పెరగనున్న
మహిళల కోటా
2011 జనాభా లెక్కల ప్రకారం
నిజామాబాద్లో 15,71,022..
కామారెడ్డిలో 9,72,625 మంది జనాభా
ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం
పునర్విభజనపై అన్నివర్గాల్లో
జోరుగా చర్చ
నియోజకవర్గాల పునర్విభజన చేపడితే శాసనసభా స్థానాల స్వరూపం ఈవిధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి..


