మాచారెడ్డి: చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం కామారెడ్డికి చెందిన పైడి గంగామణి, మధుసూదన్రెడ్డి దంపతులు రూ.71 వేలు బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఈవో ప్రభురామచంద్రం దాతలకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి శాలువా కప్పి సత్కరించారు. జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, అర్చకులు పరంధామాచారి ఉన్నారు.
మాచారెడ్డి: మధ్యాహ్న భోజనం వడ్డించేటప్పుడు పరిశుభ్రత పాటించాలని పాల్వంచ ఎంఈవో మనోహర్రావు సూచించారు. బుధవారం పాల్వంచ మండలం ఇసాయిపేట ఉన్నత ప్రాథమిక పాఠశాలలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించే ప్రదేశాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలన్నారు. వంట చేసే వ్యక్తులు తలకి కుకింగ్ క్యాప్స్ ధరించాలన్నారు. హెచ్ఎంలు దయానంద్, భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు ఉన్నారు.
గాంధారి: లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గాంధారి తహసీల్ కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ రేణుక చౌహాన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు సంజీవ్ యాదవ్, గణేష్, రమేష్, బాబా, మదార్, బాలు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్హెచ్గా మార్పు.. వైద్యుల హర్షం
కామారెడ్డి టౌన్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్పు కోసం విశేష కృషి చేసిన ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ను బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మార్పు వల్ల వైద్యులు, సిబ్బందికి ఎదురవుతున్న వేతన సమస్యలు, ఇతర పరిపాలనాపరమైన ఇబ్బందులు శాశ్వతంగా పరిష్కారమవుతాయని తెలిపారు. వైద్యులు కిషోర్, పరిపాలనా అధికారులు లక్ష్మణ్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: దేశవ్యాప్త జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీల కుటుంబాలను కూడా లెక్కించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణనపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ చేపట్టి, స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపోవడం శోచనీయమని, కేంద్రం మాట తప్పితే దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : దేశంలోని పాలకులు కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తూ, కార్మికులను, వ్యవసాయ కూలీలను వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్నారని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ. రామచందర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభల ముగింపు సభను స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగితే కార్పొరేట్ కంపెనీల లాభాలు తగ్గుతాయని, అందుకే రైతులకు కనీస మద్దతు ధర పెరగకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో 69 శాతం మంది రైతులు హెక్టారులోపు భూమి కలిగిన వారే ఉన్నారని, గత్యంతరం లేక వారు వ్యవసాయ కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ ఆర్థికవేత్త పాపారావు, సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం. కృష్ణ, పి. రామకృష్ణ, నేతలు వి. ప్రభాకర్, బి. రాము, వి.గోదావరి, పి. రామకృష్ణ, ఆర్. రమేష్, ఎ. సురేష్ పాల్గొన్నారు.
పెట్రోల్ కోసం క్యూ
ఎల్లారెడ్డిరూరల్: పెట్రోల్ కొరత వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వాహనదారులు పెట్రోల్ బంక్లకు పరుగులు తీశారు. ప్రతి ఒక్కరు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో తమకు సరిపోతుందో లేదోనని క్యూలో ఉన్న వాహనదారులు ఆందోళన చెందారు.


