● ఒకేరోజు 384 మందికి శిక్షలు విధించిన కోర్టు
● 37 మందికి జైలు.. మిగిలినవారికి జరిమానాలు
కామారెడ్డి టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. న్యాయస్థానాలు నిందితులకు జరిమానాలతోపాటు జైలు శిక్షలూ విధిస్తోంది. బుధవారం ఒకేరోజు 384 మంది మందుబాబులకు జిల్లా న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. 31 మందికి ఒక రోజు, నలుగురికి ఐదు రోజులు, మరో ఇద్దరికి ఏడు రోజుల జైలు శిక్ష వేశారు. మిగిలిన వాహనదారులకు మొత్తం రూ. 3,94,500 జరిమానా విధించారు. ఒకే రోజు ఇంత మందిపై చర్యలు తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మద్యం సేవించి వాహనం నడపడం అంటే మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టడమే. బాధ్యతాయుతమైన ప్రయాణమే కుటుంబానికి భరోసా ఇస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి.
– రాజేశ్ చంద్ర, ఎస్పీ


