● వాగ్దేవి సామినేని, ఎండీ, జనరల్ మెడిసిన్ ఫిజీషియన్(డయాబెటిక్ కౌన్సెలర్)
బాన్సువాడ: వేసవి దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎండీ, జనరల్ మెడిసిన్, ఫిజిషియన్(డయాబెటిక్ కౌన్సెలర్) వాగ్దేవి అన్నారు. సోమవారం ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రశ్న : వేసవిలో ప్రజలకు మీరిచ్చే సలహాలు.?
సమాధానం: వేసవిలో ఎండలు అధికంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. ప్రతి రోజూ 3 నుంచి 4 లీటర్ల నీటిని కాచి వడపోసి తాగాలి. ఎక్కువగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకుంటే బాగుంటుంది.
ప్రశ్న : వేసవిలో చాలా మందికి వాంతులు, విరేచనాలు వస్తాయి..దీనికి మీరిచ్చే సలహా?
సమాధానం: ఎండలో పని చేసే వారికి ఎక్కువగా వడదెబ్బ తగులుతుంది. కళ్లు తిరగడం లాంటివి వస్తున్నాయంటే వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువచ్చి. పచ్చి దుస్తులతో ఒళ్లంతా తుడిసి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఎండలో పని చేసే వారికే ఎక్కువగా వాంతులు, విరేచనాలు వస్తుంటాయి.
ప్రశ్న : వేసవిలో చల్లటి కూల్డ్రింక్లు చాలా మంది సేవిస్తారు కదా?
సమాధానం: వేసవిలో కూల్డ్రింక్లు సేవించవద్దు. ఎక్కువ చల్లగా ఉండే శీతల పానీయాలు తీసుకోవద్దు. ప్లాస్టిక్కు దూరంగా ఉండాలి. ప్లాస్టిక్ను నివారించడమే చాలా ముఖ్యం.


