సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధమైనట్లు బాధితుడు సుంకరి గంగయ్య తెలిపారు. గంగయ్యకు చెందిన రెండెకరాల జొన్న పంట చేతికొచ్చే సమయంలో అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. ప్రమాదానికి గురైన జొన్న పంటను ఆర్ఐ సంతోష్ పరిశీలించి పంచనామ నిర్వహించారు. రెండు ఎకరాల్లో సుమారు రూ.లక్షా 50వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
కుక్క దాడిలోనలుగురికి గాయాలు
రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రామంలో ఆదివారం ఓ కుక్క దాడి చేయగా నలుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో బోధన్ ఆస్పత్రికి తరలించినట్టు వారు తెలిపారు.
రామాలయంలో హుండీ చోరీ
మాక్లూర్: మండల కేంద్రంలోని రామాలయం హుండీని శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీ చేసి, అందులోని నగదు అపహరించుకపోయారు. మరుసటి రోజు ఆలయ కమిటీ సభ్యులు చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాక్లూర్ పోలీసులు వెంటనే ఆలయ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేయగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.


