● డీఆర్డీవో సురేందర్
కామారెడ్డి రూరల్: ప్రతి మహిళ అక్షర జ్ఞానం పెంపొందించుకుని సమాజంలో ఉన్నతంగా జీవించాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. ఆదివారం కామారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో నిరాక్షరాస్యులైన వయోజన మహిళలకు ఉల్లాస్ పథకంలో భాగంగా ఆదివారం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో సురేందర్ చిన్నమల్లారెడ్డి ఉన్నత పాఠశాలలో ఉల్లాస్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. శతశాతం అక్షరాస్యతను సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తున్నాయన్నారు. దీంట్లో భాగంగా 15 యేళ్ల పైబడిన నిరాక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. వారి సామర్థ్యాలను పరీక్షించేందుకు మండలంలోని 600 మంది ఈ పరీక్షకు హాజరుకాగా చిన్నమల్లారెడ్డి గ్రామంలోనే 200 మంది మహిళలు హాజరయ్యారు. వారం రోజుల్లో ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీఎంలు శ్రీనివాస్, మోయిజ్, సీబీవో ఆడిటర్ రాము, సీసీ స్వరూప, వీవోఏలు, అభ్యాసకులు పాల్గొన్నారు.
● పనులను పరిశీలించిన ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు
నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పనుల పూర్తి, భూముల ముంపు నివారణపై నిపుణుల బృందం నివేదికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఆదివారం ఒడ్డేపల్లి శివారులో ఉన్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులను సెంట్రల్ డిజైన్ ఆర్గనైజింగ్ ఎస్ఈ జహీర్తో పాటు ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తల బృందం ఇంజినీర్లు పరిశీలించారు. ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులతో వందల ఎకరాల భూములు ముంపునకు గురవుతుండటంతో పాటు రైతుల ఆందోళనలు, నష్టపరిహారం చెల్లింపులు తదితర విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందాన్ని పంపింది. అంతేకాకుండా రీడిజైనింగ్ కోసం ప్రభుత్వం రూ.30 లక్షలు మంజూరు చేయడంతో ఇంజినీర్లు పనులను పరిశీలించి ప్రభుత్వాని నివేదిక ఇవ్వనున్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజింగ్ ఎస్ఈ జహీర్ తెలిపారు. బాన్సువాడ నీటిపారుదలశాఖ ఎస్ఈ దక్షిణామూర్తి, ఈఈలు సాలోమాన్, చంద్రశేఖర్, డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఇంజినీర్లు ఉన్నారు.


