నిజాంసాగర్(జుక్కల్): మత్తడి పోచమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహమ్మద్ నగర్ మండలం నర్వలో మల్లయోధుల కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పొరుగు రాష్ట్రాల మల్లయోధులు తరలిరావడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి. గ్రామానికి చెందిన ముప్పిడి రాంప్రసాద్ గుప్తా తన తండ్రి రాములు జ్ఞాపకార్థం 5 తులాల వెండి కడియాన్ని ఆఖరి కుస్తీ మల్లయోధుడికి బహూకరించారు. డీసీసీ జిల్లా కార్యదర్శి గొట్టం నర్సింలు, ఉప సర్పంచ్ చింతల దుర్గానరేశ్ గుప్తా, నాయకులు గొల్ల గోపాల్, గంగారాం, మల్లయ్య, తదితరులున్నారు.
ఎల్లారెడ్డిరూరల్: అల్మాజీపూర్లో ఆదివారం కుస్తీ పోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా కుస్తీ పోటీలను నిర్వహించినట్లు సర్పంచ్ దేవదత్తు తెలిపారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి రెండున్నర తులాల వెండి కడియం వరకు కుస్తీ పోటీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): భవానిపేట, బాణాపూర్ గ్రామాల్లో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కుస్తీ పోటీల్లో మల్లయోధులు హోరాహోరీగా తలపడ్డారు. గెలుపొందిన వారికి సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు నగదు బహుమతులు అందజేశారు. పోటీలను తిలకించడానికి వందలాది మంది తరలివచ్చారు.
మోపాల్: మండలంలోని మంచిప్పలో ఆదివారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అండర్–20 కుస్తీ పోటీలు నిర్వహించినట్లు పీఈటీ దేవేందర్ తెలిపారు. పోటీలకు 20 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హోరాహోరీగా పోటీలు జరుగగా, విజేతలను పీఈటీ అభినందించారు. గెలుపొందిన క్రీడాకారులు ఏప్రిల్ 2న కామారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు, బాలుర విభాగంలో లక్ష్మణ్ (57 కేజీలు), మణికంఠ (55 కేజీ), యోగేష్ (60 కేజీ), జగదీష్ (55 కేజీ), కృష్ణ (70 కేజీ), బాలికల విభాగంలో.. సోనియా (50 కేజీ), సఫియా (72 కేజీ), ప్రీతి రాజ్ (68 కేజీ) ఉన్నారు.


