● మున్సిపాలిటీగా అప్గ్రేడ్కావడంతో
పెరిగిన డిమాండ్
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ చైర్పర్సన్ సీమ షెట్కార్ సమక్షంలో కమిషనర్ హయ్యుం తైబజార్ వేలం పాట నిర్వహించారు. రూ.22,70,000 లకు ఖాజమియా వేలం పాట దక్కించుకున్నారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు రూ.18,70,000 వేలం పాట పలికింది. ఇప్పుడు మున్సిపాలిటీ కావడంతో వేలంపాటలో నాలుగు లక్షల ఆదాయం అదనంగా వచ్చింది. ఈ నిధులు అభివృద్ధి, తాగునీరు ఇతర పనులకు వాడుకుంటామని చైర్పర్సన్ తెలిపారు.
గాంధారి తైబజార్ @రూ.9లక్షలు
గాంధారి(ఎల్లారెడ్డి): గాంధారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రేణుక సంజీవ్ యాదవ్, పాలక వర్గం ఆధ్వర్యంలో శనివారం తైబజారు, దాఖలాచిట్టీ(పశువుల సంత) వేలం వేసినట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. తైబజార్ను గ్రామానికి చెందిన గడ మురళి రూ.9 లక్షల 10 వేలకు దక్కించుకున్నట్లు తెలిపారు. దాఖలా చిట్టిని వాడికారి శ్రీధర్ రెడ్డి రూ.4 లక్షల 32 వేలం పాటలో దక్కించుకున్నట్లు తెలిపారు. వేలం పాట దక్కించుకున్నవారు పంచాయతీ కార్యాలయం నిబంధనల మేరకు నడుచుకోవాలని సూచించారు. ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ సంజీవు, పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి తైబజార్
@రూ.8లక్షలు
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శనివారం తైబజార్ వేలంపాట నిర్వహించారు. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్వహించిన తైబజార్ వారాంతపు సంత రూ. 8 లక్షల 40 వేలకు సుభాష్ అనే వ్యక్తి దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. డెయిలీ మార్కెట్, పశువుల సంతకు సంబంధించిన తైబజార్కు సరిపడా ఆదాయం రాకపోవడంతో సోమవారానికి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
నేటి అంగడి స్థలం మార్పు
భిక్కనూరు: ప్రతి ఆదివారం భిక్కనూరు మండల కేంద్రంలో నిర్వహించే వారాంతపు సంత (అంగడి) స్థలాన్ని మార్చుతున్నట్లు భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖసుదర్శన్ శనివారం తెలిపారు. ప్రస్తుతం ప్రతి వారం నిర్వహించే అంగడి స్థలంలో సీసీ రోడ్లను నిర్మాణపనులు జరుగుతున్నందున ఈ వారం నిర్వహించే అంగడిని వ్యవసాయమార్కెట్ గంజి ఆవరణలో ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
తైబజార్, మేకల సంతకు నాలుగు టెండర్ దరఖాస్తులు
కామారెడ్డి టౌన్: మున్సిపాలిటీకి సంబంధించి తైబజార్, మేకల సంత నిర్వహణ కోసం అధికారులు టెండర్లను ఆహ్వానించారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు గడువు ముగిసే సమయానికి తైబజార్కు రెండు, మేకల సంతకు రెండు చొప్పున మొత్తం నాలుగు దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్ మేనేజర్ రషీద్ తెలిపారు. గతంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు గడువు ముగిసిన తర్వాత రావడంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దరఖాస్తులు తక్కువగా వచ్చాయన్న కారణంతో, కొందరు కౌన్సిల్ సభ్యుల డిమాండ్ మేరకు మళ్లీ రీటెండర్ నిర్వహించాలని అధికారులు భావించారు. దీనిపై టెండర్ దాఖలు చేసిన గుత్తేదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ విషయమై శనివారం కమిషనర్ రాజేందర్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు, టెండర్ దారులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తుదారులతోనే బహిరంగ వేలం నిర్వహించాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. ఈ నెల 30వ తేదీన కౌన్సిల్ హాల్లో బహిరంగ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ సోమవారం బహిరంగ వేలం నిర్వహించకపోతే తాము కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తూ గుత్తేదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో టెండర్ దక్కించుకున్న వ్యక్తి పాలకులకు భారీగా ముడుపులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడని, అందుకే అధికారులు రీటెండర్కు మొగ్గు చూపుతున్నారని పలువురు ఆరోపించారు.


