జాతరకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
● చీనూర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో జరుగుతున్న జాతర ఉత్సవాలకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఓ ఇల్లును గుల్ల చేశారు. నాగిరెడ్డిపేట మండలం చీనూర్ గ్రామానికి చెందిన బోయిని సురేష్ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి గోపాల్పేటలో జరుగుతున్న నల్లపోచమ్మ జాతరకు వెళ్లాడు. ఆదివారం వేకువజామున సురేష్ తన ఇంటికి వచ్చే చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాతాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని 6మాసాల బంగారు కమ్మలు, 9తులాల వెండి కాళ్లపట్టీలు, 5తులాల వెండి కడియాలు, 2తులాల చేతి ఉంగరాలతోపాటు రూ.20వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహారించుకుపోయినట్లు తెలిపాడు. ఈమేరకు నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఎస్సై భార్గవ్గౌడ్ ఘటనస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలో శనివారం రాత్రి జరిగిన జాతరలో ఓ బైక్ అపహారణకు గురైంది. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన పోతరాజు బాబు తన ఫ్యాషన్ప్రో బైక్పై కుటుంబసభ్యులతో కలిసి గోపాల్పేట జాతరకు వచ్చాడు. కాగా తన బైక్ను రోడ్డు పక్కన గల పెట్రోల్బంకు పక్కన పార్క్చేసి ఉత్సవాలను చూసేందుకు ఆలయం వద్దకు వెళ్లాడు. కాగా ఆదివారం వేకువజామున రాజు పెట్రోల్బంకు వచ్చిచూడగా తన బైక్ కనిపించలేదు. దీంతో తన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు అపహారించుకుపోయాలని పేర్కొంటూ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు.


