విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తామని పదేపదే చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్లో 8.2 శాతం మాత్రమే నిధు లు కేటాయించి మరోసారి నిరాశపరిచింది. ఉపాధ్యా య సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 20 శాతం గానీ, విద్యాకమిషన్ సూచించినట్టుగా 18 శాతం గానీ, కనీసం కాంగ్రెస్ తన మెనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 15 శాతం కూడా బడ్జెట్లో కేటాయించలేదు. మాటలకు చేతలకు పొంతన లేకుండాపోయింది. – సీహెచ్ అనిల్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీపీటీఎఫ్
రైతులకు, సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే బడ్జెట్ ఇది. సీఎం రేవంత్రెడ్డి విజన్కు అనుగుణంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ను రూపొందించారు. మైనారిటీల కోసం రూ. 3,769 కోట్లు కేటాయించడం శుభపరిణామం. రాజీవ్ యువ వికాసం పథకానికి రూ. 6,000 కోట్లు, విద్యకు ప్రాధాన్యతనిస్తూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఏకంగా రూ. 36,000 కోట్లకు పైగా కేటాయించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయంపై ఉన్న నిబద్ధతను చాటుకుంది.
– షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
బడ్జెట్ చేతి వృత్తిదారులను నిరాశకు గురిచేసింది. రూ.3.24 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. రాష్ట్రంలో 25 లక్షల మంది వృత్తిదారుల సంక్షేమం, హాస్టళ్లు, స్కాలర్షిప్పులకు ఈ నిధులు ఎలా సరిపోతాయి. గత ఏడాది కేటాయించిన రూ. 1,418 కోట్లు కూడా ఖర్చు చేయలేరు. ఎన్నికల హామీల మేరకు వృత్తిదారుల కోసం బడ్జెట్లో రూ. 25 వేల కోట్లు కేటాయించాలి.
– ఎస్ వెంకట్గౌడ్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్


