మద్నూర్: ఆకాశ పందిళ్లు.. భూలోక సందళ్లు.. వేదమంత్రోచ్ఛారణలు.. మంగళ హారతుల నీరాజనాల మధ్య వరుడు వృషభ రాజు.. వధువు గో మహాలక్ష్మిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఊరంతా పెళ్లి పెద్దలుగా మారి జరిపించిన ఈ కమనీయ వేడుకకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం వేదికయ్యింది. మద్నూర్లోని ఆర్యవైశ్య సంఘం భవనంలో సోమవారం రాత్రి ఆవు, దూడల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. వేదపండితులు వెంకట్ మహారాజ్, మహేశ్ మహారాజ్లు పెళ్లి మంత్రాలను చదవగా.. అచ్చం నిజం పెళ్లిలా కార్యక్రమం సాగింది. కార్యక్రమానికి వచ్చినవారంతా ఆవుదూడలపై అక్షింతలు చల్లారు. అనంతరం భాజాభజంత్రిలు, మంగళ హారతులతో గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. వివాహానంతరం అందరూ విందు ఆరగించారు. లోక కళ్యాణం కోసం ఆవు, దూడల కల్యాణం నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు.


