కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే
పిట్లం(జుక్కల్): బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, మా కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే హెచ్చరించారు. మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హన్మంత్ సింధే మాట్లాడుతూ.. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కమీషన్ల కోసం ఒత్తిడి చేయడం వల్లే పనులు ఆగిపోయాయని ఆరోపించారు. వేరే ప్రాంతం నుంచి మా ప్రాంతానికి వచ్చి బూటకపు హామీలతో ఎమ్మెల్యేగా గెలుపొంది తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. దళిత బంధు పథకానికి నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని దళితులకు దళిత బంధు సాయం చేసింది ఎవరో గుర్తించాలని అన్నారు. రైతు మరణించిన 48 గంటల్లోనే రూ.5 లక్షల రైతు బీమా చెల్లించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. తమ హయాంలో ఏనాడూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడలేదని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ రాజు, సీనియర్ నాయకులు అన్నారం వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, విజయ్, ప్రతాప్ రెడ్డి, షేక్ కరీం, నర్సాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


