రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రయత్నాలు
కామారెడ్డి టౌన్: రాజకీయ లబ్ధి కోసమే కామారెడ్డిలో బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే క్యాంపు కార్యాలయంపై దాడి పేరుతో నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేకు అత్యంత సమీప బంధువని, ఆయన తప్ప కాంగ్రెస్ నుంచి రెండో వ్యక్తి అక్కడకు వచ్చాడని నిరూపిస్తే కాంగ్రెస్ నాయకులు తాము రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ విసిరారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరెని సందీప్ తదితరులు పాల్గొన్నారు.


