కేసుల సంగతేంటీ
కేసుల మీద కేసులు..
ఆరోపణలు సరే..
కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన ఆస్తుల విషయంలో అక్రమాలు జరిగాయంటూ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ కాలేజీ భూములపై నడుస్తున్న కేసులను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో కాలేజీ ఆస్తుల విషయంలో అక్రమాలతోపాటు, కేసులను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
● కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
భూములపై కోర్టుల్లో
కొనసాగుతున్న కేసులు
● నేతలు చొరవ చూపితే పరిష్కారం!
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రత్యేకమైన కోర్సులతో ఏడు దశాబ్ధాల కాలంలో వేలాది మందికి జీవితపాఠాలు నేర్పిన విద్యావృక్షంగా కీర్తికెక్కింది. ఇక్కడ చదివిన వారిలో వందలాది మంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. అయితే దశాబ్దాల కాలంగా కాలేజీ చుట్టూ అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. పలు కేసుల్లో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది.తాజాగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిల మధ్యన నడుస్తున్న మాటల యుద్ధంలో కాలేజీ ఆస్తులు వివాదం మరోమారు తెరపైకి వచ్చింది. నేతలు మాత్రం అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారు కానీ.. కోర్టుల్లో కొనసాగుతున్న కేసులను పట్టించుకోవడం లేదు.
వివిధ సంస్థలకు కాలేజీ భూములు..
ప్రజావసరాల కోసం అప్పట్లో కాలేజీ భూములను కేటాయించారు. సబ్ స్టేషన్ల కోసం ఐదెకరాలు, ఇండస్ట్రియల్ పార్కు కోసం 20 ఎకరాలు, వేర్ హౌజింగ్ గోదాం కోసం ఆరెకరాలు, ఇందిరాగాంధీ స్టేడియం కోసం 11 ఎకరాలు, పోలీస్ స్టేషన్ కోసం రెండెకరాలు ఇచ్చారు. డెయిరీ కాలేజీ కోసం 60 ఎకరాలు ఇవ్వగా అందులో కాలేజీ భవనంతో పాటు హాస్టల్ భవనాలు నిర్మించారు. మున్సిపల్ ఫిల్టర్బెడ్, ఆడిటోరియం కోసం 4.36 ఎకరాలు కేటాయించారు. ఇటీవలి కాలంలో మెడికల్ కాలేజీ కోసం 20 ఎకరాలు కేటాయించగా, కాలేజీ భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాలేజీ స్థలంలోనే గురుకుల భవనాలు కూడా నిర్మించారు.
రూ. వందల కోట్ల విలువ చేసే కాలేజీ భూములపై పలు కేసులు నడుస్తున్నాయి. కాలేజీ విద్యార్థుల ఆటస్థలం ఉన్న సర్వే నంబరు 782లోని 8.26 ఎకరాలు, అలాగే మున్సిపల్ ఫిల్టర్బెడ్, కళాభారతి ఆడిటోరియం ఉన్న సర్వే నంబరు 199లోని 6.38 ఎకరాల భూములపై వివిధ కోర్టుల్లో కేసులు ఉన్నాయి. అలాగే ప్రైవేటు బీఈడీ కాలేజీతోపాటు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన అద్దె చెల్లింపు విషయంలో ఆయా సంస్థల యాజమాన్యాలు కోర్టుల్లో కేసులు వేశాయి. అద్దె విషయంలోనూ వివాదం కొనసాగుతోంది. హైకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయి. అయితే కాలేజీ ఆస్తులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ముఖ్య నేతలు కాలేజీ మీద నడుస్తున్న కేసుల విషయంలో చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరితో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలని, కేసులను కొలిక్కి తీసుకువచ్చి ఇబ్బందులు తొలగించాలని విద్యాభిమానులు కోరుతున్నారు.
కేసుల సంగతేంటీ


