‘ఆపరేషన్ కవచ్’తో సత్ఫలితాలు
కామారెడ్డి క్రైం: ఆపరేషన్ కవచ్ పేరుతో జిల్లావ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రత్యేక తనిఖీలతో సత్ఫలితాలు వస్తున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ఇటీవల దేవునిపల్లి పోలీసులు జిల్లా కేంద్రానికి సమీపంలోని నర్సన్నపల్లి చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఆటోలో తరలిస్తున్న 50 గ్రాముల గంజాయి లభించిందన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగల ముఠాల గుర్తింపు, పీడీఎస్ బియ్యం, గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణా లాంటి అనేక కేసులను తనిఖీలతో గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బంది రాత్రింబవళ్లు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారన్నారు. గంజాయిని గుర్తించి పట్టుకున్న కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్సై నర్సయ్య, సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డులను అందించారు.
కామారెడ్డి టౌన్: కామారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక పోటీలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఖోఖో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అతీఖుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపేవారిని ఈనెల 18 నుంచి 20 వరకు నారాయణపేట జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల జట్లు తమ ఎంట్రీలను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలని, పూర్తి వివరాల కోసం 85559 96271, 94942 59901 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే వేదికగా టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయం నిలవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సంఘం సీనియర్ నాయకులు టి.హన్మండ్లు చేతులమీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల సాధనలో టీపీటీఎఫ్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించి, పలువురు మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు లింగం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, ప్రతినిధులు శ్రీనివాస్, లచ్చయ్య, అంజయ్య, వెంకట్రాంరెడ్డి, అశోక్ కుమార్, శంకర్, నళినిదేవి, నరేందర్, నాగభూషణం, లక్ష్మి, శ్రీవాణి, మంగమ్మ, హిరణ్మయి, మీనా భూషణ్, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. సోమార్పేట్ గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చెన్న లక్ష్మణ్ రెండు రోజుల క్రితం ఆవుల మందను మేతకోసం గ్రామ శివారుకు తీసుకువెళ్లాడు. లేగ దూడ కనిపించకపోవడంతో అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాడు. అతడికి ఆదివారం దూడ కళేబరం కనిపించింది. దూడకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితుడు అటవీ అధికారులను కోరుతున్నాడు. కాగా సోమార్పేట్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఎల్లారెడ్డి: గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గిరిజన గురుకుల పాఠశాలల ఆర్సీవో గంగారాం నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 21 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.
‘ఆపరేషన్ కవచ్’తో సత్ఫలితాలు


