
క్రైం కార్నర్
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లిలో సోమవారం విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన కౌలు రైతు కర్రోల్ల సాయిలు(52) మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సాయిలు అదే గ్రామానికి చెందిన ఒకరి పొలం కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం సాయిలు, భార్య లలిత కలుపు తీసేందుకు పొలానికి వెళ్లారు. పొలానికి నీళ్లు పారించేందుకు సాయిలు బోరు మోటారు స్టార్టరు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని రైల్వే పోలీసులు కాపాడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. సాలూరా మండలంలోని హాజీపూర్కు చెందిన పవన్ (28) ఇంజినీరింగ్ పూర్తి చేసి నిజామాబాద్లో ఉంటున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్, మద్యానికి బానిస కావడంతో అప్పులయ్యాయి. అప్పుల బాధలు ఎక్కువ కావడంతో రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు. గాయపడిన పవన్ను రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
నవీపేట: మండలంలోని యంచ సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న బ్రిడ్జికి వాడే ఐరన్ రాడ్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. అనూష ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బ్రిడ్జికి వినియోగించే ఇనుప రాడ్లను యంచ సమీపంలో నిల్వ చేశారు. యంచ గ్రామానికి చెందిన పీరాజి వ్యాకంటి కొన్ని రోజులుగా ట్రాక్టర్లో ఇనుమును దొంగిలించాడని పేర్కొన్నారు. దాదాపు రెండు టన్నుల ఇనుప రాడ్లను దొంగిలించినట్లు తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. చోరీకి పాల్పడిన పీరాజి వ్యాకంటిని సోమవారం అరెస్టు చేసి, రెండు టన్నుల ఇనుప రాడ్లను రికవరీ చేశామని ఎస్సై తెలిపారు. చోరీకి ఉపయోగించిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్