
లారీలు రావు.. ధాన్యం బస్తాలు పోవు
నిజాంసాగర్ : నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ధా న్యం తూకాలు వేసినా లారీలు సక్రమంగా రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. మహమ్మద్నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం తూకాలు చేపడుతున్నారు. రైతుల నుంచి ధాన్యం కాంటా వేయడంతో పాటు ధాన్యం బస్తాల తరలింపునకు తంటాలు పడుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రానికి లారీలు సక్రమంగా రాకపోవడంతో కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 3 వేల వరకు ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. రోజుకు ఒక్క లారీ చొప్పున వస్తుండడంతో ధాన్యం బస్తాల నిల్వలు రోజురోజుకు పేరుకుపోతున్నాయని రైతులంటున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు చేసే యంత్రాలు చెడిపోతుండడంతో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
కోమలంచ కొనుగోలు కేంద్రంలో
రైతులకు తిప్పలు
మూడు వేల బస్తాలు కేంద్రంలోనే ఉన్నాయి
ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కేంద్రం నిర్వహిస్తున్నాం. బిహారీ కూలీలు హమాలీ చేస్తుండటంతో తూకాలు చేపడుతున్నాం. రోజుకు ఒక్కలారీ మాత్రం వస్తుండటంతో ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం మూడు వేల బస్తాల ధాన్యం కేంద్రంలోనే ఉన్నాయి. రోజు ఒక్క లారీ మాత్రం వస్తుండటంతో ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు వెళ్లడం లేదు. రోజుకు రెండు, మూడు లారీలు పంపిస్తే కొరత ఉండదు.
– విజయ, గ్రామ సంఘం అధ్యక్షురాలు

లారీలు రావు.. ధాన్యం బస్తాలు పోవు