డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి

Published Wed, Mar 19 2025 1:34 AM | Last Updated on Wed, Mar 19 2025 1:35 AM

పెళ్లయిన పదమూడు

రోజులకే మృత్యు ఒడికి..

చెరువులో పడి యువకుడి మృతి

సదాశివనగర్‌: పెళ్లయిన పదమూడు రోజులకే ఓ యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన సదాశివనగర్‌ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కడమంచి రాములు(26) ఆరు నెలల క్రితం దుబాయి నుంచి వచ్చాడు. ఈ నెల 6న మెట్‌పల్లికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. గ్రామ సమీపంలోని పాత చెరువులో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన రాములు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. రాములకు ఈత రాకపోవడంతోనే నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో గల్లంతైన రామగళ్ల దశరథం(38) అనే వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. మహమ్మద్‌నగర్‌ మండలం బూర్గుల్‌ గ్రామానికి చెందిన దశరథం సోమవారం గ్రామ శివారులోని ప్రధాన కాలువలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది ప్రధాన కాలువ నీటిలో గాలించారు. సింగీతం గ్రామ శివారులోని ప్రధాన కాలువ బ్రిడ్జి వద్ద మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

మాచారెడ్డి: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య

త్నించిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై అనిల్‌ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన బానోత్‌ పద్మ(43) అంగవైకల్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించింది. కొద్ది సేపటికి విషయాన్ని గమనించిన కుటుంబీకులు సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

రెండు బోరు మోటార్ల చోరీ

మాచారెడ్డి: పాల్వంచ మండల శివారులోని ఇద్దరు రైతుల బోరు మోటార్లను గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి దొంగిలించినట్టు ఎస్సై అనిల్‌ తెలిపారు. గ్రామానికి చెందిన గాలి బొందయ్య, కొండె శ్రీనివాస్‌లకు చెందిన వ్యవసాయ భూమిలోని బోరు మోటార్లతో పాటు వైర్లను ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

ఇసుక టిప్పర్‌ పట్టివేత

బోధన్‌ టౌన్‌: మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు టిప్పర్‌ను పట్టుకున్నట్లు సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్‌ పట్టణంలోని బెల్లాల్‌ రైల్వేగేట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ టిప్పర్‌ను ఆపి పరిశీలించగా అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టిప్పర్‌ను స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

భిక్కనూరు: జాతీయ రహదారిపై బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలైన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో మంగళవారం వేకువజామున చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఈసీఎల్‌ ప్రాంతానికి చెందిన అనంత్‌(23), సంజన స్నేహితులు. వీరు సోమవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చి మంగళవారం వేకువజామున తిరిగి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా జంగంపల్లి శివారులోని జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో అనంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా సంజనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సంజనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, అనంత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

కరెంట్‌ షాక్‌తో..

సదాశివనగర్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్‌ మండలం ఉత్తునూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిసె సతీశ్‌(25) మంగళవారం ఉదయం పొలంలో మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. పిచికారీ కోసం కావాల్సిన నీటిని తెచ్చేందుకు తన వ్యవసాయ బావిలోకి దిగాడు. బావిలో ఉన్న మోటర్‌ వైర్‌ తెగి నీటిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించని సతీశ్‌ నీటిని తీసుకుంటుండగా కరెంట్‌షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

చెరువులో పడి మహిళ..

పిట్లం: ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి చెందిన ఘటన పిట్లం మండలం కిష్టాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నోళ్ల సత్యవ్వ(45) మంగళవారం ఉదయం 10 గంటలకు గ్రామ చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోవడంతో నీట మునిగి మృతి చెందింది. భర్త బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మద్నూర్‌: ట్రాక్టర్‌పై నుంచి పడి ఒకరు మృతి చెందిన ఘటన మద్నూర్‌ మండలం చిన్న ఎక్లార గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్‌ మండలం మేనూర్‌ గ్రామానికి చెందిన దశరథ్‌(25) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్న ఎక్లార శివారులో ట్రాక్టర్‌పై మట్టిని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్‌ వెనుక చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడు..

మరొకరికి తీవ్రగాయాలు

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి1
1/4

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి2
2/4

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి3
3/4

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి4
4/4

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌.. ఒకరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement