● నేటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్
● కాకినాడ పీఆర్ జూనియర్
కళాశాలలో నిర్వహణ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం ప్రారంభం కానుంది. దీనికి కాకినాడ బాలాజీచెరువు సెంటర్ వద్ద ఉన్న పీఆర్ జూనియర్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన ద్వారంతో పాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు స్పష్టం చేశారు.
1.57 లక్షల జవాబు పత్రాల చేరిక
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు సంబంధించి 1.57 లక్షల జవాబు పత్రాలు మూల్యాంక నం కోసం జిల్లాకు చేరాయి. మరో 20 వేలు వచ్చే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూల్యాంకనం రెండు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ, రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. ఒక్కో ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఈ మూల్యాకనం కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 110 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 83 మంది స్క్రూటినైజర్లు, 15 మంది ఏసీఓలను నియమించారు. స్పాట్ క్యాంపు ఆఫీసర్గా ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి (ఆర్ఐఓ) వ్యవహరిస్తారు. జనరల్–1, జనరల్–2, సీసీఓ–1, సీసీఓ–2గా పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు వ్యవహరిస్తారు.
అలసత్వం వహిస్తే చర్యలు
మూల్యాంకన విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ అధ్యాపకులను ఆయా కళాశాలల నుంచి రిలీవ్ చేయాలని ప్రిన్సిపాల్స్ను ఆదేశించాం. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ఫోన్ అనుమతి లేదు. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంతటి వారికై నా చర్యలు తప్పవు.
– వి.కేశవరావు. జిల్లా ఇంటర్మీడియెట్
విద్యాశాఖాధికారి, కాకినాడ


