సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరవైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా దగా చేశారని ఆక్షేపించారు. కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ వివిధ పథకాల పేరుతో మహిళలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు షరా మామూలేనని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తానని మోసం చేసిన బాబు ఏ ముఖం పెట్టుకుని మహిళా దినోత్సవానికి హాజరవుతారో చూస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి మహిళలు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు మహిళలు ఎదురు చూస్తున్నారని, అయితే, రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడి బయట పడటం లేదని రాజా అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాతకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, నాయకులు కృష్ట్రపియ, శేషుకుమారి పాల్గొన్నారు.


