
నిమజ్జనాలకు సిద్ధమైన ఉప్పాడ తీర ప్రాంతం
పిఠాపురం: గణపతి నవరాత్రులు ముగుస్తున్నాయి. అందరి దృష్టీ వినాయక విగ్రహ నిమజ్జనాలపైనే ఉంది. తొలి రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభమైనా తొమ్మిదో రోజు భారీ విగ్రహాలను ఎక్కువగా నిమజ్జనం చేయడం ఆనవాయితీ. జిల్లాలోని ఉప్పాడ సాగర తీరం ఏటా ఈ నిమజ్జనాలకు వేదిక అవుతుంది. కాకినాడ పరిసరాల్లో పెద్ద విగ్రహాలు ఇక్కడే నిమజ్జనం చేస్తుంటారు. గత ఏడాది నిమజ్జన వేడుకల్లో ప్రమాదాలు సంభవించి ముగ్గురు మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఈసారి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రిప్ కరెంటు కెరటాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రాకాసి అలలకు బలి
సాగరతీరంలో అలల్లో దాగి ఉంటే రిప్ కరెంట్ (చీలిక ప్రవాహాలు)పై నిమజ్జనోత్సవ వేళ అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ కెరటాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. అలల మాటున పొంచి ఉండి ఒక్క సారిగా దాడి చేసి పెను విషాదాన్ని సృష్టిస్తున్నాయి. ఏమరుపాటుగా ఉంటే సముద్రంలోకి లాగేస్తుంటాయి. తూర్పు తీరంలో ఆగస్టు– అక్టోబర్ నెలల మధ్య రిప్ కరెంట్ అలలు ఎక్కువగా ఉంటాయని సముద్ర పరిశోధకులు నిర్ధారించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే వీటి ధాటికి ఎక్కువ మంది గురై మృత్యువాత పడ్డారు. ఉప్పాడ తీరంలో గతేడాది జరిగిన ప్రమాదంలో ముగ్గురు రిప్ కరెంట్ వల్లే చనిపోయారని భావిస్తున్నారు.
ముందుగా గురించేందుకు ప్రయోగాలు
ఇప్పటి వరకు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో సుమారు 370 మంది వరకు రిప్ కరెంట్ వల్ల ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రిప్ కరెంట్ను కనుగొనడానికి ఏయూ, ఇస్రో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్టును నిర్వహిస్తున్నాయి. ఈ పరిశోధకులు సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ప్రత్యేక పరికరం ద్వారా అలల తరంగం ఎత్తు దిశ సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా భవిష్యత్తులో రిప్ కరెంట్ ఎక్కడ ..ఎలా ఏర్పడతాయో గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసేలా ప్రయోగాలు చేస్తున్నారు.
ఆదమరిస్తే అంతే సంగతి
గతేడాది ఉప్పాడలో ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతం రిప్ కరెంట్ ఉత్పత్తయినదేనని గుర్తించారు. అక్కడ ఏలేరు కాలువ సముద్రంలో కలుస్తుంది. సముద్రం కొంత ఒంపు తిరిగి కూడా ఉంటుంది. అక్కడ వచ్చే కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇటు నుంచి అటు నుంచి ఒకేసారి కెరటం రావడం రెండు ఢీ కొనడం వల్ల రిప్ కరెంట్ (స్క్వేర్ అలలు) ఏర్పడి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసే సందర్భంలో అలల ఉధృతి తక్కువగానే ఉన్నా ఉప్పుటేరు ఉధృతి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో సముద్ర అలలు ఒక్కసారిగా పెరగడంతో రెండు కలిసి రిప్ కరెంట్గా మారి ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి నిమజ్జనాలు చేయకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాం
ఉప్పాడ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి అనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశం. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేధించాం. ఇతర ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశాం. ఈఏడాది బందోబస్తు పటిష్టం చేస్తున్నాం. ముఖ్యంగా ఉప్పుటేరులు సముద్రంలో కలిసే చోట అలలు తక్కువగా ఉన్నా క్షణాల్లో ప్రమాదకరంగా మారుతుంటాయి. కాకినాడ శివారు లైట్హౌస్ నుంచి కొత్తపల్లి మండలం కోనపాపపేట వరకు ఉన్న ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. మూలపేట, సుబ్బంపేటల్లో నిమజ్జనానికి వీలుగా సిద్దం చేశాం. ఇక్కడే నిమజ్జనాలు చేసి సహకరించాలి.
– వైఆర్కే శ్రీనివాస్, సీఐ, పిఠాపురం.
నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జనాలు
పోలీసులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జనాలు చే యాలి. నిబంధనలు కాదని ఇతర ప్రాంతాల్లో చేస్తే చ ర్యలు తీసుకుంటాం. ఎంతో భక్తి పూర్వకంగా నిర్వహి ంచే వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతులు దొర్లకుండా ఉత్సవ నిర్వాహకులు అధికారులకు సహకరించాలని కోరుతున్నాం. తద్వాత విలువైన ప్రాణాలను కాపాడుకోవాలి. నిమజ్జనాలకు గట్టి ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకున్నాం.
– ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ ఆర్డీఓ
రిప్ కరెంట్ అంటే
బలమైన అలల మధ్య ఇరుకై న ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు.
ఇవి మనిషిని ఒక్కసారిగా లోతైన ప్రదేశంలోకి బలంగా లాగేస్తాయి.
సముద్ర గర్భంలో సుదూర ప్రాంతలో గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా దూసుకు వస్తాయి.
ఈ అలలు తీరానికి వచ్చే సరికి సముద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది.
ఆ ప్రవాహంలో ఎవరున్నా రెప్పపాటులో కడలిలో కలిసి పోతారు.
తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడతాయి.
తిరిగి కెరటం వెనక్కి సముద్రంలోకి వెళ్లేటప్పుడు ఏర్పడే తీవ్రత అంతా ఇంతా కాదు. దానినే రిప్ కరెంట్ అంటారు.
కరెంట్ షాక్ కంటే ఎక్కువగా ప్రభావం చూపి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి.
రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి.
కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఉప్పుటేరులు కలిసే కాలువల దగ్గర రిప్ కరెంట్ అలలు ఏర్పడుతుంటాయి.
రిప్ కరెంట్ ప్రవాహ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది అల చీలికలో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది.

ఉప్పాడలో నిమజ్జన ప్రాంతాన్నిపరిశీలిస్తున్న ఆర్డీఓ సత్యనారాయణ
