
లక్షణంగా బదిలీలు
కార్యదర్శి స్థానానికి రూ.లక్ష
కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు ఆనుకుని ఉన్న సెమీ అర్బన్ ప్రాంతాల్లో పోస్టుల కోసం ఉద్యోగులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుల కోసం వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పైరవీలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తమ చేతికి మట్టి అంటకుండా షాడోలను రంగంలోకి దింపి పని చక్కబెడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నేతల క్యాంపు కార్యాలయాల వద్ద సచివాలయ ఉద్యోగుల నుంచి వివిధ శాఖల ఉద్యోగుల వరకూ సిఫారసు లేఖల కోసం పడిగాపులు పడుతున్నారు. ఆ ప్రజాప్రతినిధులు కూడా అనుకూలమైన అధికారులను, సిబ్బంది తమ తమ నియోజకవర్గాల్లో కొలువుదీరేలా కుస్తీ పడుతున్నారు. చోటామోటా నేతలు కూడా సిఫారసు లేఖలు ఇప్పిస్తామంటూ ఉద్యోగుల నుంచి సొమ్ము గుంజుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో కార్యదర్శి సీటు కోసమే కూటమి నేతలు రూ.లక్ష వరకు రేటు ఫిక్స్ చేసి లాగేస్తున్నారు.
● చేయి తడపందే పోస్టింగ్లు లేవు
● సిఫారసు లేఖల్లో సిత్రాలెన్నో..
● సెమీ అర్బన్కు డిమాండ్
● చక్రం తిప్పుతోన్న షాడోలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నేతల సిఫారసు లేఖలు (ఉత్తరం), సొమ్ము ముట్టజెప్పడం (దక్షిణం) లేకుండా బదిలీల ఫైళ్లు ముందుకు కదలడం లేదు. కూటమి ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దగ్గర నుంచి కోరుకున్న చోటు కోసం ఉద్యోగులు నేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. నేతల సిఫారసు లేఖల కోసం క్యాంపు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బదిలీల వ్యవహారాల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధుల అనుచరులు చక్రం తిప్పుతున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలకు బదిలీల్లో వెసులుబాటు కల్పించారు.
ఈ నేపథ్యంలో బదిలీలు అనివార్యం అనుకున్న వివిధ శాఖల ఉద్యోగులు జిల్లా కేంద్రానికి అందుబాటులో ఉన్న కేంద్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఉదాహరణకు జిల్లా కేంద్రం కాకినాడలో పనిచేస్తున్న ఉద్యోగులు సమీప మండలాలైన కరప, కాకినాడ, పెదపూడి, సామర్లకోట వంటి ప్రాంతాల్లో బదిలీలు ఆశిస్తున్నారు. ఇందుకు ఆయా మండలాల్లో అధికార కూటమి నేతలు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోవడంలో బిజీబిజీగా కనిపిస్తున్నారు. చేయి తడపందే నేతల సిఫారసు లేఖలు చేతిలో పెట్టడం లేదంటున్నారు.
2వ తేదీ వరకూ అవకాశం
రెండేళ్లు నిండిన వారు బదిలీలకు అర్హులు కాగా, ఐదేళ్లు నిండినవారు తప్పనిసరిగా బదిలీ కావాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అన్ని శాఖల్లో బదిలీలకు వచ్చే నెల 2వ తేదీ వరకూ అవకాశం ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టు దక్కించుకోవటం కోసం నానా పాట్లు పడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, కూటమి నేతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా అనుకున్న ప్రాంతాల్లో పోస్టింగులను ఖాయం చేసుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు తమకు ఎటువంటి ప్రమేయం లేదన్నట్టు బిల్డప్ ఇస్తూ అనుచరుల ద్వారా సిఫారసు లేఖలు చేతిలో పెడుతున్నారు.
ఈ వ్యవహారంలో అందినంతా జేబులో వేసుకుంటున్నారంటున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని విభాగాలు కలిపి సుమారు 54 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 10 నుంచి 15 శాతం అంటే ఏడేనిమిది వేల మందికి బదిలీలు జరుగుతున్నాయని అంచనా. మొత్తం బదిలీల్లో సింహభాగం వైద్య, ఆరోగ్య శాఖలోనే జరుగుతున్నా యి. తరువాతి స్థానంలో ఉపాధ్యాయులున్నారు.
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు
నేటితో ముగియనున్న గడువు
ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ఇన్ని చిత్రాలు జరుగుతుంటే ఉపాధ్యాయుల బదిలీలు కూడా ఊపందుకున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 15,400 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2023 తరువాత బదిలీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్, ప్రధానోపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయి. ఇందులో ఒకేచోట ఐదేళ్లు దాటి పనిచేస్తున్న వారికి బదిలీలు చేస్తున్నారు. మొత్తం అన్ని విభాగాలకు సంబంధించి సుమారు 3,696 మంది బదిలీలకు అర్హులుగా విద్యాశాఖ తేల్చింది. ఉపాధ్యాయులు, గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల దరఖాస్తుల గడువు ఈ నెల 22తో ముగిసింది. ప్రస్తుతం జరుగుతున్న స్కూల్ అసిస్టెంట్లు బదిలీ దరఖాస్తుల ప్రక్రియ కూడా వాస్తవంగా శనివారంతో ముగియాలి. ఒక్క రోజు గడువు ఇవ్వడంతో ఆదివారం రాత్రితో ముగిసింది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తు గడువు ఈ నెల 27 తేదీ ముగియనుంది. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకున్నారు. కౌన్సెలింగ్ మాత్రం మాన్యువల్గానే నిర్వహించనున్నారు. ఈ నెల 27 తేదీ అర్ధరాత్రికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో బదిలీల ప్రక్రియను నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా విద్యాశాఖ వద్ద నిర్ధారణ కానుంది. అనంతరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారిని కాకినాడ డీఈఓ కార్యాలయానికి పిలుస్తారు. మొదట మండలం, తరువాత స్కూల్ను స్క్రీన్పై ప్రదర్శిస్తే ఉపాధ్యాయులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు మరో రెండు రోజులు మిగిలి ఉంది.
సామాజికవర్గాల వారీగా యత్నాలు
ప్రధానంగా కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీల్లో పోస్టింగ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో సామాజికంగా తమ వర్గం వారిని నియమించుకునేందుకు నియోజకవర్గ నేతలు పట్టుబడుతున్నారు. కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పెద్దాపురం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్తో పాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట తదితర మున్సిపాలిటీల్లో పోస్టింగ్లకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. రెండు బలమైన సామాజికవర్గాల నేతలు తమ వారి కోసం ఎమ్మెల్యేల వద్దకు సిఫారసు లేఖల కోసం క్యూ కడుతున్నారు. అర్హతలతో పాటుగా పని విధానం, సీనియార్టీ చూడకుండా కేవలం సామాజిక అంశాన్ని ప్రామాణికంగా సిఫారసు రావడంతో అధికారులు విస్తుపోతున్నారు.