
వారెవ్వా జతగాళ్లు చిత్ర విశేషాలను వివరించిన దర్శకుడు సత్య సలాది
సామర్లకోట: తమిళనాడులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ‘వారెవ్వా జతగాళ్లు’ చిత్రం నిర్మించామని దర్శకుడు సత్య సలాది తెలిపారు. బుధవారం స్థానికంగా ఉన్న తన స్వగృహంలో సినిమా హీరో పిట్టా లక్ష్మణ్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలను వివరించారు. ఈ సినిమా నూతన నటీనటులతో నిర్మించామన్నారు. ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా సుమారు 650 థియేటర్లలో మే నెలలో రిలీజ్కు చేయనున్నట్టు చెప్పారు. తన స్వగ్రామం సామర్లకోట మండలం ఉండూరు అన్నారు. అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు యువకులు గ్రామస్తులు మెచ్చుకునే పనులు చేసి వారెవ్వా జతగాళ్లు అనిపించుకొంటారని చెప్పారు. పోసాని కృష్టమురళి, జబర్ధస్త్ మురళి, కన్నడ నటుడు రాబర్ట్ లూయిస్, ప్రియాంక, మమత ఇందులో నటించారని వివరించారు. జిల్లాకు చెందిన సాయిపవన్, లక్ష్మణ్, రాజబాబు, అరవిందస్వామి హీరోలుగా పరిచయం అవుతున్నారన్నారు. నిర్మాతలుగా బండారు నాగబాబు, దొడ్డి వీర ప్రభాకర్, వీరబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్గా సంతోష్ పని చేశారని వివరించారు. సినీ దర్శకుడు కేబీ ఆనంద్ పాల్గొన్నారు.
పురోహితుల క్రికెట్ టోర్నీ ప్రారంభం
కొవ్వూరు: ఐ.పంగిడి గ్రామంలో బుధవారం రాష్ట్ర స్థాయి పురోహితుల క్రికెట్ టోర్నమెంటును జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు చౌటుపల్లి వీరన్న, టీడీపీ నేత పొట్రు సిద్ధూ ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురోహిత సంఘం అధ్యక్షుడు వారణాసి హనుమంతశర్మ తెలిపారు. మొదటి రోజు ఖమ్మం, నూజివీడు, కొవ్వూరు, వాడపల్లి, కాకినాడ జట్లు పోటీల్లో పాల్గొన్నాయని తెలిపారు.