అలంపూర్: రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే విజయుడు రైతులతోపాటు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఇరిగేషన్ ఎస్ఈ కేశవరావును కలిసి.. ఇటిక్యాల, ఎర్రవల్లి మండలంలోని రైతుల సమస్యలను వారికి వివరించినట్లు చెప్పారు. జూరాల మెయిన్ కెనాల్తోపాటు నెట్టెంపాడు 100, 106 ప్యాకేజీల పరిధిలోని రైతుల సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు, సాగు చేయాల్సిన పంటలకు అవసరమైన సాగునీటిని అందించాలని కోరారు. అనంతరం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ అబ్దుల్ కరీంని ఎమ్మెల్యే కలిసి నియోజకవర్గంలోని రైతుల సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. పంట సాగుకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని, ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని, కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎస్ఈ దృష్టికి తెచ్చారు.
80 ఫీట్ల వద్దనే
రెండో ఆర్వోబీ నిర్మాణం
గద్వాల: జిల్లాకేంద్రంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా గద్వాల మార్గం మీదుగా అనేక రైళ్లు తిరుగుతున్న నేపథ్యంలో రెండో ఆర్వోబీ నిర్మాణం కావాలని ఎంపీ డీకే అరుణ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వివరించి పాతహౌసింగ్బోర్డు కాలనీ ప్రాంతంలో 80 ఫీట్ల రోడ్డు వద్ద ఆర్వోబీ నిర్మాణం ఏర్పాటుకు ఒప్పించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. గురువారం ఆయన డీకే బంగ్లాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు స్వార్థం కోసం రాజకీయ దురుద్దేశంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పాతహౌసింగ్ బోర్డు కాలనీలోని 80 ఫీట్ల రోడ్డు వద్దనే రెండో ఆర్వోబీ నిర్మాణం చేపడతారని, ఇందుకోసం అన్నిరకాల అనుమతులు సైతం ఎంపీ డీకే అరుణ సాధించారని వివరించారు. గద్వాల జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఎంపీ డీకే అరుణ కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. అలాగే సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ పాల్గొన్నట్లు తెలిపారు.


