ఎర్రవల్లి: మహనీయుల ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని పదో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బీచుపల్లి పదో పటాలంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగినా.. తెలంగాణ ప్రజలకు విముక్తి కలగలేదన్నారు. కానీ, అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యంతో నిజాం నిరంకుశ పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. తెలంగాణ భారతదేశంలో విలీనమైన ఈ రోజును తెలంగాణ ప్రభు త్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరమణ, ఆర్ఐలు రాజు, శ్రీనివాస్, వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ పాల్గొన్నారు.


