● పెరిగిన సామగ్రి ధరలతో
సాగుతున్న నిర్మాణాలు
● కూలీలకూ డిమాండ్తో
లబ్ధిదారుల బెంబేలు
మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలతోపాటు కార్మికులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెరగడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోని అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసినప్పటికీ ఆర్థిక కష్టాలతో ఇళ్లను నిర్మించుకోలేని వారు చాలా మంది ఉన్నారు. వీరికి మొదటి దశలో ఇళ్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించలేక మధ్యలోనే ఆపేశారు. మరికొందరు లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు కాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన వారు అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
పెరిగిన ధరలు ఇలా..
ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి ఇసుక, సిమెంట్, స్టీల్ సెంట్రింగ్, కంకర, బైండింగ్ వైర్, బోర్వెల్ లాంటి సామగ్రి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి లబ్ధిదారుల ఎంపిక జరగడంతో ఈ సామగ్రికి డిమాండ్ పెరిగింది. దీంతో లబ్ధిదారుల ఇబ్బందులు పడుతూ ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. 2025 సంవత్సరానికి ముందు సిమెంట్ ఒక బస్తాకు రూ.265 ఉండగా ప్రసుత్తం రూ.320కి చేరింది. అలాగే 2025 డిసెంబర్లో స్టీల్ ధర క్వింటా 10 ఎంఎం బార్లు 20కి రూ.2,300 ఉండగా.. ప్రస్తుతం రూ.3800కు చేరుకుంది. ఇసుక ట్రాక్టరు రూ.2 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.3,500కు ఇస్తున్నారు. ఇలా అనేక ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై మరింత భారం పెరిగింది.
భవన నిర్మాణ కార్మికులకు..
ఇంటి నిర్మాణ సామగ్రితోపాటు భవన నిర్మాణ కార్మికుల కూలీ రేట్లు సైతం పెరిగాయి. గతంలో 400 గజాల స్లాబ్ను మేసీ్త్రలు రూ.1.65 లక్షలకు నిర్మించి ఇచ్చేవారు. అదే ఏరియాలో ఇప్పుడు ప్రస్తుతం రూ.2.65 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నిర్మిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇలా అనేక సామగ్రితోపాటు కూలీల ధరలకు రెక్కలు వచ్చాయని చెబుతున్నారు. గతంలో మేసీ్త్రకి కూలి రూ.800 ఉంటే ఇప్పుడు రూ.వెయ్యికిపైగా తీసు కుంటున్నారు. 10 వేల ఇటుకల లారీ లోడ్ రూ.71 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.92 వేలకు చేరుకుంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఇంటి సామగ్రి ధరలు తగ్గించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.


