గద్వాల క్రైం: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి అన్నారు. క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణ దిశగా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించడంతో పాటు అనుమానితులకు పరీక్షలు చేసి.. వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రతినెలా రూ. 500 ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు. క్షయ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవాలని.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం తదితర లక్షణాలు కలిగిన వారు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని తెలిపారు. అంతకు ముందు పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించి.. సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.


