రాజోళి: డిజిటల్ క్రాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప అన్నారు. సోమవారం వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామంలో పర్యటించిన ఆయన పంటలను పరిశీలించారు. ప్రతి పంటను కాపాడుకునేందుకు రైతులు చేసే కృషి ఎనలేనిదని, వారు చేస్తున్న సాగును అధికారులు కూడా నమోదు చేయాలన్నారు. అనంతరం మండలంలోని పలుచోట్ల ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. దుకాణాల యజమానులు తప్పకుండా రైతులు కొనుగోలు చేసిన వాటికి బిల్లు ఇవ్వడంతోపాటు నాణ్యమైన విత్తనాలు, మందులు అమ్మాలని, ప్రతి దానికి రిజిష్టర్ నిర్వహణ తప్పకుండా ఉండాలన్నారు. ఎలాంటి తేడాలు కనిపించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డీఏఓ వెంట మండల ఏఓ రాధ తదితరులున్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,402
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 1,501 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.8,402, కనిష్టంగా రూ.4,229, సరాసరిగా రూ.6,942 ధరలు లభించాయి. అలాగే 15 క్వింటాళ్ల కంది రాగా.. రూ.7,206 ఒకే ధర పలికింది. 17 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టంగా రూ.6,159, కనిష్టంగా రూ.5,829, సరాసరిగా రూ.6,159 ధరలు వచ్చాయి.
● నారాయణపేట మార్కెట్యార్డులో పెసర క్వింటా గరిష్టంగా రూ.7,977, కనిష్టంగా రూ.7,427, వేరుశనగ గరిష్టంగా రూ.8,169, కనిష్టంగా రూ.5,940, జొన్నలు గరిష్టంగా రూ.5,369, కనిష్టంగా రూ.5,160, అలసందలు గరిష్టంగా రూ.6,209, కనిష్టంగా రూ.5,600, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,969, కనిష్టంగా రూ.6,501, తెల్లకందులు గరిష్టంగా రూ.7,629, కనిష్టంగా రూ.6,769 ధరలు పలికాయి.
రేపు జిల్లా అథ్లెటిక్స్క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈనెల 15న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల కార్నివాల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను ఈనెల 11వ తేదీన స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్లలోపు బాలబాలికలకు 60 మీ., 600 మీటర్ల పరుగు, 20 ఏళ్లలోపు వారికి 100 మీ., 400మీటర్ల పరుగు, పురుషులు, మహిళలకు 100 మీ., 400మీటర్ల పరుగు పందెం పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్ఎస్సీ మెమో, జనన ధ్రువీకరణ పత్రం, కులధ్రువపత్రంతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు.


