కదిలింది.. చెన్నకేశవుడి రథం
(ఇన్సెట్లో) మాట్లాడుతున్న మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు
దేవదేవుడైన శ్రీచెన్నకేశవస్వామి ఉభయ దేవేరులతో కలిసి అధిష్టించిన దివ్యరథం భక్తుల జయజయ ధ్వానాల మధ్య ముందుకు కదిలింది. ముందుగా ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో ఊరేగిస్తూ రథం వద్దకు తీసుకువచ్చారు. మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణ మధ్య ఆదివారం రాత్రి 11.19 గంటలకు శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి రథాన్ని వేలాదిగా తరలివచ్చిన భక్తులు పోటీపడి లాగారు. అంతకు ముందు స్థానిక పాతబస్టాండ్లోని రథశాల దగ్గర మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పాంత్రం ప్రాశస్త్యం, కోటకున్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని గద్వాలకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. గద్వాలను పవిత్ర యాత్ర స్థలంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. గద్వాల ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. లోక కల్యాణం కోసం ప్రతిఒక్కరు ఆధ్యాత్మిక చింతను అలవర్చుకుని, నిత్యం పూజలు చేయాలని సూచించారు. – గద్వాల టౌన్
కదిలింది.. చెన్నకేశవుడి రథం


