విద్యార్థులకు ప్రోత్సాహం అవసరం
గద్వాల టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను ప్రోత్సహించినప్పుడే మరింత ముందుకు వెళ్తారని డీఈఓ విజయలక్ష్మి అభిప్రాయపడ్డారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ఆవరణలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్, సోషల్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్టును నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 70 పాఠశాలలకు చెందని 150 మంది విద్యార్థులు టాలెంట్ టెస్టులో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలుగు మీడియం విభాగంలో విజయలక్ష్మి (తనగల), రాఘవేంద్ర (కొండాపూర్), కిషోర్ (ఉత్తనూర్), హరినాథ్గౌడ్ (మేడికొండ) వరుస నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లిష్ మీడియం విభాగంలో పూజిత (గద్వాల), అఖిలసాయి (మానవపాడు), హాప్సా (గద్వాల) వరుస మూడు స్థానాలు స్థానాలు సాధించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదుతోపాటు ప్రశంస పత్రాలను డీఈఓ విజయలక్ష్మి అందజేసి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి చదువులో అత్యంత ప్రతిభ అవసరమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో సోషల్ ఫోరం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, ఎస్ఓ అంపయ్య, నాయకులు రాజుసాగర్, హన్మంతునాయక్, శంకర్నాయక్, భాస్కర్రెడ్డి, చంద్రన్న, శ్రీనివాసులు, రాజు, మహేందర్, అశోక్, కృష్ణగౌడ్, రాముడు, పరశురాం తదితరులు పాల్గొన్నారు.


